Saturday, July 27, 2024

బతుకమ్మ, దసరాకు టీఎస్ఆర్టీసీ సన్నద్దం

తప్పక చదవండి
  • పోలీస్, రవాణా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం
  • ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు
  • వైట్ నంబర్ ప్లేట్ కలిగిన ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించొద్దు: వీసీ సజ్జనర్

హైదరాబాద్ : బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ఈ నెల 13 నుంచి 24వ తేది వరకు 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంస్థ.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారి అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. “టీఎస్ఆర్టీసీకి పోలీస్, రవాణా శాఖలు ఎంతగానో సహకరిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో సంస్థ ఉద్యోగులతో కలిసి వారు పనిచేస్తున్నారు. ప్రయాణికులను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థకు వస్తోన్న ఫలితాల్లో పోలీస్, రవాణా శాఖల పాత్ర కూడా ఉంది. గతంలో మాదిరిగానే ఈ దసరాకు ఆయా శాఖలు సహకరించాలి.” అని వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు కోరారు. బతుకమ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి 23 వరకు అధిక రద్దీ ఉండే అవకాశముండటంతో.. ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించినట్లు వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా తిప్పుతున్నట్లు తెలిపారు.

“హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్ లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తాం. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లనూ నియమిస్తున్నాం.” అని సజ్జనర్ తెలిపారు. ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా టీఎస్ఆర్టీసీ ఇటీవల తీసుకువచ్చిన గమ్యం ట్రాకింగ్ యాప్ ను వినియోగించుకోవాలన్నారు. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని సూచించారు. టీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు.

- Advertisement -

బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్(ట్రాఫిక్) జి.సుధీర్ బాబు మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీకి తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చడానికి టీఎస్ఆర్టీసీతో సమన్వయంగా పని చేస్తామని చెప్పారు. ఈ సమన్వయ సమావేశంలో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, అశోక్ కుమార్, శ్రీనివాస్, రాచకొండ, ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీలు రణవీర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రవాణా శాఖ చెందిన ఆర్టీఏలు రఘునందన్ గౌడ్(ఇబ్రహీంపట్నం), రామచందర్(హైదరాబాద్ సెంట్రల్), శ్రీనివాస్ రెడ్డి (హైదరాబాద్ నార్త్)తో పాటు టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు