- దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రం..
హైదరాబాద్ : అవయవదానం, టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్లో అత్యుత్తమ సేవలు అందించడంలో తెలంగాణ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నది. అవయవదాన ప్రాధాన్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న అవగాహన ఫలిస్తున్నది. అవయవాలను ఇతరులకు దానం చేసి మరికొంత మంది ప్రాణాలను నిలుపుతున్న రాష్ర్టాల జాబితాలో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. శనివారం తమిళనాడులో నిర్వహించిన అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ జీవన్దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత అవార్డును అందుకొన్నారు. డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం దేశంలో ఏటా 5 లక్షల మంది ప్రధాన అవయవాలు పనిచేయక మృతిచెందుతున్నారు. ఇలాంటి వారిని బతికించాలంటే అవసరమైన అవయవ మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2012లో రాష్ట్ర ప్రభుత్వం ‘జీవన్ధాన్’ పేరుతో ఒక సంస్థను స్థాపించింది. తొలి ఆరు నెలలపాటు అవయవదానం ప్రాముఖ్యత, ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించింది. 2013 జనవరి 13న మొట్టమొదటిసారిగా చెన్నైకి చెందిన 40 ఏండ్ల వ్యక్తి తన అవయవాలను దానం చేసినట్టు అధికారులు తెలిపారు.