- ఆత్మహత్యలు మీ సమస్యలకు పరిష్కారం కాదు..
- మీకు అండగా టిఎన్ఎస్ఎఫ్ విభాగం ఉంటుంది..
- ట్రిబుల్ ఐటీ బాసర విద్యార్థుల ఆత్మహత్యలకు
ప్రభుత్వం,యూనివర్సిటీ అధికారులు కారణాలు చెప్పాలి.. - ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించండి..
- మరో దారుణం జరక్కుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి..
- డిమాండ్ చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్..
హైదరాబాద్ : బాసర రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బూర లిఖిత మృతిచెందిన ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. హాస్టల్ భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి చెందినట్లు భావిస్తున్నప్పటికీ ఈ ఘటనకు గల కారణాలు ఇంకా బహిర్గతంకాలేదు. దీంతో శనివారం టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకులు ఆందోళన బాట పట్టాయి. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ.. విద్యార్థిని బూర లిఖిత మృతి తమని ఎంతో కలిచివేసిందని అన్నారు. ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా కారణాలను ఎందుకు వెల్లడించలేకపోయారని ప్రభుత్వాన్ని, యూనివర్సిటీ అధికారులను ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మరో ఘటన జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కార మార్గం కాదని టిఎన్ఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు సంఘీభావం తెలిపే ప్రయత్నం చేయగా పోలీసులు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ బృందాన్ని అదుపులోకి తీసుకుని సమీప బాసర పోలీస్ స్టేషనుకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు అమరేందర్ గణేష్, ముదోలో అసెంబ్లీ ఇన్చార్జి కుబీర్ విఠల్, అదిలాబాద్ పార్లమెంట్ సెక్రెటరీ పాడి మోహన్, టిడిపి బైంసా రాజు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు..