- ప్రజ్ఞాన్ తన పనిని ప్రారంభించిందన్న ఇస్రో ఛైర్మన్..
- ఇస్రోకు అభినందనలు తెలిపిన గూగుల్ సిఇవో సుందర్ పిచాయ్..
- సూపర్ కూల్ అని ట్వీట్ చేసిన ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్..
- చంద్రయాన్ – 3 సూపర్ సక్సెస్ తో మిన్నంటిన సంబరాలు..
( జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్ ప్రపంచంలోనే ఈ ఘనతను సాధించిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. తిరుగులేని విజయం సాధించింది.. ఇవి అద్భుత క్షణాలు ఇస్రోకు అభినందనలు : టెక్ దిగ్గజం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. )
అనుకున్నట్లే చంద్రయాన్ – 3 ప్రాజెక్టు సూపర్ సక్సెస్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధృవంపై విజయవంతంగా దిగింది. ఇక రోవర్ ప్రజ్ఞాన్ కూడా తన పని మొదలు పెట్టేసింది. ఇండియాను సూపర్ పవర్ దేశంగా మార్చేసిన చంద్రయాన్ – 3 ప్రాజెక్టు గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధృవంపై ఎందుకు విక్రమ్ ల్యాండర్ను దించాల్సి వచ్చిందో ఆయన వివరించారు. చంద్రుడిపై దక్షిణ ధృవానికి చాలా దగ్గరగా వెళ్లామని, దాదాపు అది 70 డిగ్రీలు వద్ద ఉన్నట్లు చెప్పారు. చంద్రుడి దక్షిణ ధృవంతో ప్రత్యేక అడ్వాంటేజ్ ఉందన్నారు. సూర్య రశ్మి ఎక్కువగా తాకని కారణంగా ఆ అడ్వాంటేజ్ వేరుగా ఉంటుందని అన్నారు. ఇక్కడ ఎక్కువ శాతం సైంటిఫిక్ కాంటెంట్ దొరికే ఛాన్సు ఉందన్నారు. మూన్ మిషన్పై పనిచేస్తున్న చాలా మంది శాస్త్రవేత్తలు దక్షిణ ద్రువంపైనే ఆసక్తిగా ఉన్నట్లు ఇస్రో చీఫ్ తెలిపారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనుషులు ఆ ప్రాంతానికి వెళ్లాలని, అక్కడ కాలనీలను ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత తిరుగు ప్రయాణం చేయాలన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. మనం ఎదురుచూస్తున్న బెస్ట్ ప్లేస్ అదే అని ఆయన చెప్పారు. చంద్రుడి దక్షిణ ద్రువంలో కాలనీలు ఏర్పాటు చేసేందుకు.. అక్కడ ఆ సామర్థ్యం ఉన్నట్లు ఆయన తెలిపారు.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ – 3 విజయవంతంగా సేఫ్ ల్యాండిరగ్ కావడం పట్ల యావత్ దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా మూన్ మిషన్ విజయవంతం కావడంతో ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రయాన్ – 3 సక్సెస్ నేపధ్యంలో ఇస్రోకు టెక్ దిగ్గజం, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలిపారు. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్ ప్రపంచంలోనే ఈ ఘనతను సాధించిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. తిరుగులేని విజయం సాధించిన ఇస్రోను సుందర్ పిచాయ్ అభినందించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ అసాధారణ విజయం సాధించిందని, ఇవి అద్భుత క్షణాలని పిచాయ్ ట్వీట్ చేశారు. ఈ ఘనత సాధించిన ఇస్రోకు అభినందనలని ఆయన రాసుకొచ్చారు. ఇక చంద్రయాన్ – 3 మిషన్ విజయవంతం కావడంపై ట్విట్టర్ అధిపతి ఎలన్ మస్క్ స్పందించారు. పిచాయ్ ట్వీట్పై మస్క్ రియాక్టవుతూ సూపర్ కూల్ అని కామెంట్ చేశారు.