- మంచి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం
- ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట : భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు. మంచి సమాజం తయారు కావాలంటే మంచి విద్యతోనే సాధ్యపడుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత సర్వేపల్లి సొంతం అన్నారు. మహనీయుల స్ఫూర్తితో విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా.. పెను మార్పులు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది అన్నారు. అన్ని వర్గాల పేద బిడ్డలకు కార్పొరేట్ విద్యను అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలు అద్భుత ఫలితాలు సాధిస్తూ దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని అన్నారు. వాటికి వస్తున్న భారీ స్పందనే దీనికి నిదర్శనం అన్నారు. దీంతో గురుకులాలను యేటా పెంచుతూ పోతున్నారన్నారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర సర్కారు రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నదన్నారు. విద్యారంగంలో కేసీఆర్ తెచ్చిన గురుకులాలు కొత్త చరిత్రకు నాంది పలికాయన్నారు. ప్రైవేట్ బాట వీడి గురుకులాల్లో చాలా మంది విద్యార్థులు చేరుతున్నారంటే.. వీటిని ఏ స్థాయిలో అభివృద్ధి పర్చారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉండగా.. వేలాది మంది విద్యను అభ్యసిస్తూ లబ్ది పొందుతున్నారని పేర్కొన్నారు. విద్యారంగంలో కొత్త శకం ఆవిష్కృతం అవుతుందన్నారు. ఈ విజయంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది అని కొనియాడారు. సమాజానికి దిక్సూచి ’ఉపాధ్యాయుడు’ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్ఞా దీపిక యుంగధర్, వైస్ చైర్మన్ గోపగానివెంకట్ నారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, తదితరులు పాల్గొన్నారు.