Monday, May 20, 2024

రూ.50 వేలు..

తప్పక చదవండి
  • ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తు ధర నిర్ణయించిన కాంగ్రెస్..
  • టిక్కెట్ కావాలా ? ముందుగా రూ. 50 వేలు కట్టాల్సిందే !
  • టికెట్ ఆశావహుల నుంచి దరఖాస్తులకు కాంగ్రెస్ ఆహ్వానం
  • ఈనెల 18 నుంచి 25 వరకు దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపికపై తొలి జాబితా రెడీ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. కానీ కొత్తగా అభ్యర్తుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయిచింది. దరఖాస్తు ధరను రూ. యాభై వేలుగా నిర్ణయించారు. ఇదేంటీ.. ఇదేమైనా పథకమా.. దరఖాస్తు చేసుకుంటే ఫిల్టర్ చేసి అర్హులకు వర్తింపజేస్తారనేందుకు.. అందులోనూ దరఖాస్తుకు 50 వేలేంటీ.. అని ముక్కున వేలేసుకోకండి. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బంపర్ ఆఫర్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు నాకు కావాలంటే నాకు కావాలంటూ లీడర్లు తెగ పోటీ పడుతుంటారు. ఒక్కో నియోజకవర్గంలో పది నుంచి పదిహేను మంది కూడా బరిలో దిగేందుకు ఆసక్తి చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా.. ఈ ఆసక్తిని కాంగ్రెస్ ఒడిసిపట్టుకునేందుకు గట్టి ప్లాన్‌నే అమలు చేస్తోంది.

అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నాయకత్వం సూచించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆగస్టు 18 నుంచి 25 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్టు పేర్కొంది. అయితే.. ఈ దరఖాస్తులు ఫ్రీ కాదండోయ్.. ఓసీ అభ్యర్థులైతే రూ.50 వేలు, బీసీలైతే రూ.25 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా.. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత మంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. దరఖాస్తు చేసుకున్న వారికే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని నాయకత్వం స్పష్టం చేసింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. ప్రజల్లో వారికి ఫాలోయింగ్ ఎలా ఉంది అన్న విషయాలను అంచనా వేసి టికెట్లను కేటాయించనుంది. ఆగస్టు 25 వరకు వచ్చిన అప్లికేషన్లకు… కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో స్క్రీనింగ్ నిర్వహించి.. టికెట్లు కేటాయించనున్నారు. ఇదిలా ఉంటే.. కర్ణాటక ఇచ్చిన బూస్టప్‌తో తెలంగాణలో ఈసారి కాంగ్రెస్‌లో మంచి జోష్ కనిపిస్తోంది. ఈసారి తెలంగాణలో అధికారం చేపట్టేది కాంగ్రెసేనన్న మాటను జనంలోకి గట్టిగా తీసుకెళ్తున్నారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం ఆశావహుల ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. దీని వల్ల.. టికెట్ కేటాయించటంలో నాయకత్వానికి ఎలాంటి వెసులుబాటు ఉంటుందో తెలియదు కానీ.. ఎన్నికల కోసం ఫండ్ మాత్రం గట్టిగానే వస్తుందన్న టాక్ నడుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు