- నేడు జరుగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో అతిధిగా మోడీ..
- భారత్, ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా విస్తృత చర్చలు..
- ఫ్రాన్స్ నుంచి 26 రాఫెళ్ళు, 3 సబ్ మెరైన్ల కొనుగోలు కోసం ఒప్పొందాలు..
- ప్రఖ్యాత లా సెనె మ్యూజికలెలో ప్రసంగించనున్న మోడీ..
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. గురువారం ప్యారీస్లో అడుగుపెట్టారు. నేడు జరగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా ఆయన పాల్గొననున్నారు. బస్టీల్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్లో ఆ దేశ బలగాలతో కలిసి భారత సాయుధ దళాలు కూడా పాల్గొననున్నాయి. రక్షణ, అంతరిక్ష, మౌలిక, సాంస్కృతిక రంగాలతోపాటు వివిధ విభాగాల్లో భారత్-ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మానుయేల్ మాక్రాన్తో విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. ఈ మేరకు రెండు నెలలక్రితం మాక్రాన్ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారు.
మరోవైపు భారత నేవీ కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెళ్లు, 3 సబ్మెరైన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం మోదీ పర్యటన సందర్భంగా కుదిరే సూచనలున్నాయి. గురువారం సాయంత్రం ఫ్రెంచ్ ప్రధాని ఎలిజిబెత్ బోర్నెతో సమావేశమవనున్నారు. సెనేట్ సందర్శనలో భాగంగా సెనేట్ ప్రెసిడెంట్ గెర్రార్డ్ లార్చర్తో భేటీ కానున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రఖ్యాత లా సెనె మ్యూజికలెలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.