- తెలంగాణలో నేటితో ముగిసిన నామినేషన్ల గడువు
- చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు… టిక్కెట్ల కేటాయింపు
- పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన ఆయా పార్టీల అభ్యర్థులు
- మూడు గంటల లోపు క్యూలో నిలుచుకున్న వారికి అవకాశం
- 119 నియోజకవర్గాలకు 1,133 మంది అభ్యర్థులు 1,169 నామినేషన్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే, ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు బీఫాంలు సమర్పిస్తేనే ఆయా పార్టీల అభ్యర్థులుగా గుర్తిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పలు పార్టీలు చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం… చివరి నిమిషంలో టిక్కెట్లు కేటాయించిన కారణంగా కొంతమంది హడావుడిగా నామినేషన్లు దాఖలు చేశారు. మూడు గంటల లోగా నామినేషన్ వేసేందుకు సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి వరుసలో నిలుచున్న అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఈనెల 15తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఈనెల 30న పోలింగ్ నిర్వహిస్తారు. కాగా నిన్నటి వరకు 119 నియోజకవర్గాలకు 1,133 మంది అభ్యర్థులు 1169 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కార్యాలయం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చివరి రోజు నామినేషన్లు దాఖలు కావడంతో 119 నియోజకవర్గాలలో మొత్తం 2500కు పైగా నామినేషన్లు దాఖలు అయినట్టు తెలుస్తోంది. చివరి రోజు ఆర్వో కార్యాలయాల వద్ద కోలాహలం కనిపించింది. అయితే ఇంకా అధికారికంగా మొత్తం ఎన్ని నామినేషన్లు దాఖలు జరిగిందో వెల్లడించలేదు. అత్యధికంగా గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాలలో నామినేషన్లు దాఖలు అయినట్టు సమాచారం.