- భావి ప్రధానిగా అఖిలేష్ ని పేర్కొంటూ పోస్టర్లు..
- యూపీలో ఎస్.పీ. గణనీయమైన సీట్లు గెలుస్తుందన్న అభిమానులు..
- ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయని అఖిలేష్ యాదవ్..
విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి జాబితాలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజాగా వచ్చి చేరారు. ఆయనను భవిష్యత్ ప్రధానిగా పేర్కొంటూ పలు పోస్టర్లు లక్నోలో వెలిసాయి. అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు లక్నో కార్యాలయం వెలుపల అఖిలేష్ను ”భావి ప్రధాని”గా పేర్కొంటూ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్య కూటమికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో పీఎం ఆశావహుల జాబితాలో అఖిలేష్ యాదవ్ పేరు తెరపైకి రావడం విశేషం.
ఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ పోస్టర్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పోస్టర్లను ఆ పార్టీ ప్రతినిధి ఫకృల్ హసన్ చాంద్ ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, యూపీలో జరిగే 2024 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని, లోక్సభలో భారీ ప్రాతినిధ్యం ఉన్న ఉత్తరప్రదేశ్కు అత్యంత రాజకీయ ప్రాధాన్యత ఉందని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు అఖిలేష్ యాదవ్పై అచంచలమైన నమ్మకం ఉందని, సమాజ్వాదీ పార్టీ ఘనవిజయానికి అంకింతభావంతో పనిచేయనున్నారని తెలిపారు. యూపీలో ఎస్పీ గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందని, అంతిమంగా అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రి కావడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. అఖిలేష్ పుట్టినరోజు సందర్భంగా సమాజ్వాదీ పార్టీ హెచ్చు సంఖ్యలో లోక్సభ సీట్లు గెలుచుకుని ఆయన ప్రధాని కావాలని తామంతా కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలకు మద్దతుగా నిలుస్తున్న అఖిలేష్ యాదవ్ మాత్రం ఇంతవరకూ తాను ప్రధాని అభ్యర్థిగా ఉండాలన్న కోరికను బహిరంగంగా వ్యక్తం చేయలేదు.