అమరావతి : స్కిల్డెవలప్మెంట్ కేసులో ప్రస్తుతం రిమాండ్పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించడం హృదయవిదారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. చంద్రబాబు క్షేమం గురించి వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేసినందున ఆయనకు తక్షణ వైద్య సహాయం అవసరమన్నారు. చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గడం ఆయన కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులమంతా తీవ్ర ఆందోళన చెందుతున్నామని నారా బ్రహ్మణి ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక్కొక్కటిగా కేసుల్లో ఊరట లభిస్తోంది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు నేడు (శుక్రవారం) ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. లక్షరూపాయలు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కేసులో ఉన్న నిందితులందరూ రూ.లక్ష చొప్పున పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది. కాగా.. మొన్న రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంటుపై విచారణ ప్రక్రియను న్యాయస్థానం ఈ నెల 16 వరకూ నిలుపుదల చేసింది. పీటీ వారెంటు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. పీటీ వారెంటు విధానంలో తప్ప జ్యుడీషియల్ కస్టడీలోఉన్న పిటిషనర్ను నేరుగా అరెస్టు చేసే ఉద్దేశం లేదని సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ లిఖితపూర్వకంగా సమర్పించిన హావిూని న్యాయస్థానం రికార్డుచేసింది. విచారణను16వ తేదీకి వాయిదా వేసింది. ఇక నేడు అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించడంలో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు వేర్వేరు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి నేడు (శుక్రవారం) కీలక విచారణలు జరుగుతున్నాయి. అంగళ్లు అల్లర్ల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్ట్ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో మిగతా కేసులో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, వాదనలు, కోర్టు వెలువరించబోయే తీర్పు సర్వత్రా ఉత్కంట నెలకొంది.