సిద్దిపేట : కేసీఆర్ మాట అంటే తప్పడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొందరి నాలుకకు నరం లేదనీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు. పొరపాటున రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడితే.. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టేనని విమర్శించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వైద్య వ్యవస్థను బలోపేతం చేశామని వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీల సంఖ్య పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో భూమికి బరువు అయ్యేంత పంట పండుతున్నదని చెప్పారు. గతంలో ఎరువుల బస్తా కోసం చెప్పులను క్యూలైన్లో పెట్టేవారని, ఇప్పుడు ప్రభుత్వం తగినంత యూరియాను అందుబాటులో ఉంచుతున్నదని చెప్పారు. గతంలో మనం ఇతర ప్రాంతాలకు కూలీకి వెళ్లేవాళ్లమని, ఇప్పడు పక్క రాష్ట్రాల వారికి కూలీ ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. వీఏఓలను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఉద్యోగస్తులతోపాటు పీఆర్సీ కల్పించామని తెలిపారు. బీబేపీ గ్యాస్ ధరను అడ్డగోలుగా పెంచిందని, దాన్ని తగ్గించాడనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఏ పథకం అయినా మహిళ పేరుతో పెడితే సద్వినియోగం అవుతుందని, అందుకే మహిళల పేరుట కేసీఆర్ పథకాలు అమలుచేస్తున్నారని వెల్లడించారు. క్షనికావేశంలో మహిళలు ప్రాణాపాయ నిర్ణయాలు తీసుకోవద్దని భరోసా, సఖి కేంద్రాలను ప్రారంభించామని వెల్లడించారు. 120 మంది ఉండేలా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మించామన్నారు. బాల రక్ష భవన్లో 6 ఏండ్ల నుంచి 18 ఏండ్ల ఆడపిల్లలకు రక్షణ ఇస్తారని చెప్పారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు శిశుగ్రహ కేంద్రంలో రక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఆడపిల్ల పెండ్లికి కల్యాణ లక్ష్మి ద్వారా రూ.లక్ష అందిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలేవీ ఇలా ఇవ్వలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇచ్చే 2016 పింఛన్ వల్ల వయోవృద్ధులకు కొంత ఉపశమనం కలిగిందని చెప్పారు. వయోవృద్ధులను వృద్ధాశ్రమంలో కన్న తల్లిదండ్రుల వలె చూసుకుంటామని తెలిపారు. నూతన జిల్లాలలోనే మొదటి జిల్లా సమాఖ్య భవనం సిద్దిపేటలోనే ఉందన్నారు.