- ఎప్పటిలోగా జమచేస్తారో చెప్పండి
- పెట్టుబడి సాయంపై స్పష్టత లేదని వ్యాఖ్య
- అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా ప్రజల పక్షానే ఉంటాం
- రూ.15వేలు ఇస్తామని చెప్పి… ఇవ్వడం లేదని విమర్శ
- అప్పుడే విమర్శలు మొదలు పెట్టిన హరీష్ రావు
హైదరాబాద్ : అధికారం పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఎప్పటికీ తాము ప్రజల పక్షాన నిలబడుతామని మాజీ మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తామని చెప్పారని..రైతుబంధు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూనే రైతుబంధుపై ప్రశ్నలు వేశారు.. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తోందని తెలిపారు. వడ్లు అమ్ముకొకండి.. తాము బోనస్తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అధికారంలోకి వచ్చారు.. రూ. 500 బోనస్తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మిగ్జాం తుపాను కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయని, అలాంటి రైతులను ఆదుకోవాలని హరీశ్రావు కోరారు. ప్రభుత్వం నుంచి కొంత స్పష్టత కావాలని.. విమర్శలు చేయడానికి తాము రాలేదన్నారు. వ్యవసాయ పెట్టుబడిపైన ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఓ వైపు వర్షాలు పడుతున్నాయని.. బోనస్ యెప్పుడు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారని.. డిసెంబర్ 9న ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వటం లేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నవంబర్ చివరి వారం డిసెంబర్ మొదటి వారంలో వేశామని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతుభరోసా ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. యాసంగి పంట వేసే సమయం వచ్చిందని.. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. డిసెంబర్ 9 వచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని హరీష్రావు నిలదీశారు.