Friday, May 3, 2024

బీఆర్ఎస్ కు సెంటిమెంట్ గా మారిన గజ్వేల్ స్థానం..

తప్పక చదవండి
  • అక్కడ గెలిచినవారి పార్టే తెలంగాణ రాష్ట్రంలో కీలకం..
  • ఆ స్థానం నుంచే యువరాజును పోటీకి దింపే అవకాశం..
  • కేటీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే సీఎం మరో స్థానం నుంచి పోటీ..
  • కామారెడ్డి లేదా పెద్దపల్లిలో బరిలో కేసీఆర్ అంటూ పార్టీవర్గాల్లో లీకులు..
  • వ్యూహకర్తల రిపోర్టుల ఆధారంగా తెరపైకి యువరాజు పేరు..
  • రెండు గ్రూపులుగా విడిపోయిన గజ్వేల్ నియోజకవర్గం..
  • ఇతరులెవరూ పోటీ చేసినా నెగిటివ్ ఫలితం వచ్చే అవకాశం..
  • మెదక్ ఎంపీ సీటుపై వంటేరు కన్ను,టికెట్ ఇస్తారా లేదా అన్నది తేలాలి..
    ” వాసు ” పొలిటికల్ కరస్పాండెంట్..
    ఇప్పటి వరకూ కేసీఆర్ అంటే గజ్వేల్.. గజ్వేల్ అంటే కేసీఆర్ అనే పేరు మారుమోగింది. ఇక నుంచి గజ్వేల్ అంటే కేటీఆర్.. కేటీఆర్ అంటే గజ్వేల్ అనేలా పేరు వినపడుతుందని ప్రచారం జోరందుకుంది ? తండ్రి స్థానంలో తనయుడు గజ్వేల్ నుంచి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. దాంతో సీఎం కేసీఆర్
    ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
    హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కామారెడ్డి లేదా పెద్దపల్లికి షిఫ్ట్ అవుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణలో పట్టుబిగించేందుకు ఆ ప్రాంతంలో కేసీఆర్ పోటీ చేయాలనే వ్యూహంలో భాగంగానే ఈ మార్పులకు అవకాశముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ గజ్వేల్లో పోటీ చేస్తే ఆయన గెలుపు సునాయాసం కావడమే కాకుండా స్టార్ క్యాంపెయినర్ గా ఇతర జిల్లాలకు ఎక్కువ సమయం ఇవ్వడానికి వీలుంటుందనే ఆలోచన బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది..
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి ని అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీలోచేరడంతో ఆయనకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ పదవి కట్టబెట్టారు. అప్పటి నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో విపక్షాల ఉనికే లేకుండా పోయింది. తెరాస పార్టీ బీఆర్ఎస్ గా మారడంతో కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నుంచి కాకుండా కామారెడ్డి లేదంటే పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.. లేదా ఎన్నికల సమయంలో నెలకొన్న పరిస్థితులను బట్టి మరో చోటి నుంచి పోటీ చేయొచ్చంటున్నారు విశ్లేషకులు.
    సీఎం కేసీఆర్ చూపు మహారాష్ట్ర వైపు :
    మహారాష్ట్రలోని ఓ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి అక్కడ పట్టు బిగించాలని సీఎం కెసిఆర్ చూస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు. అదే జరిగితే గజ్వేల్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ ముందుకొచ్చింది. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగానే ఉంది. కానీ.. పార్టీలో గ్రూపులున్నాయి. అనైక్యత వల్ల కేసీఆర్ తప్ప ఇంకెవ్వరు పోటీ చేసినా బీఆర్ఎస్ కు నెగిటివ్ ఫలితం వస్తుందంటూ వ్యూహకర్తలు చేసిన సర్వేలో తేలడంతో కేటీఆర్ మళ్ళీ గజ్వేల్ నుంచే పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
    గజ్వేల్ సెంటిమెంట్ కోసమే కేటీఆర్ పేరు పరిశీలన :
    అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ దేశ రాజకీయాల్లో యాక్టివ్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారనే చర్చ కూడా జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెజార్టీ సీట్లు వస్తే ముఖ్యమంత్రిగా తాను కాకుండా తనయుడిని (కేటీఆర్) చేయాలనుకుంటున్న కేసీఆర్ తన సెంటిమెంట్ కు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నట్టు చర్చించుకుంటున్నారు.
    గజ్వేల్ స్థానం బీఆర్ఎస్ కు సెంటిమెంట్ :
    తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో వర్గల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. గజ్వేల్ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది ఆనవాయితీ అని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గం నుంచి అందరికీ కలిసి వచ్చిందని, పోటీ చేసి గెలిచిన వారు కీలక పదవుల్లో కొనసాగారని, ఈ సెంటిమెంట్ ను నమ్ముకునే నేనూ బరిలోకి దిగానని.. ఆయన అన్న మాటలకు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. అదే సెంటిమెంట్ తో రాబోయే ఎన్నికల్లో యువరాజుకు పట్టాభిషేకం చేయాలని భావిస్తున్న కేసీఆర్.. గజ్వేల్ నుంచి కేటీఆర్ ను పోటీకి సిద్దం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబానికి గజ్వేల్ సేఫ్ జోన్ గా మారింది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న గజ్వేల్లో కేటీఆర్ పోటీ చేస్తే గెలుపు ఖాయమే కాకుండా భవిష్యత్ లోనూ సొంతింటి మకాంగా మారనుందంటున్నారు విశ్లేషకులు.
    సర్వే ఫలితంతోనే కేటీఆర్ పేరు తెరమీదికి :
    బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఇతర నాయకుల్ని పోటీకి దించితే ఎలా ఉంటుందనే విషయంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు సెంటిమెంట్ స్థానం కావడంతో ఆ పార్టీకి చెందిన నాయకులు గట్టిగానే పోటీ పడుతున్నారు. దీంతో గజ్వేల్ లో గ్రూపులు కూడా పెరిగిపోయాయి. దీంతో పార్టీలో నువ్వా నేనా అన్నచందంగా స్వంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్న గ్రూపుల వల్ల కేసీఆర్ కాకుండా ఇతరులెవ్వరు పోటీ చేసినా ఓడిపోయే పరిస్థితి నెలకొంది.
    ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఒక గ్రూపు :
    అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ వంటేరు ప్రతాపరెడ్డి ఒక గ్రూపుగా కొనసాగుతుండగా.. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ రాజమౌళితో పాటు మార్కెట్ కమిటీ చైర్మెన్ మరో గ్రూపుగా ఉన్నారు. ఈ గ్రూపుల లొల్లితో కేసీఆర్ లేదా కేటీఆర్ తప్ప ఇతరులెవ్వర్ని పోటీ చేయించినా బీఆర్ఎస్ లో వ్యతిరేక ఫలితాలు వస్తాయని సర్వేలో స్పష్టమైంది. దాంతో కేసీఆర్ ఇతర అభ్యర్థుల పరిశీలనను పక్కన పెట్టి తన స్థానంలో కేటీఆర్ ను పోటీ చేయించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అందు కోసం స్థానిక నాయకుల్ని ఒప్పించేందుకు తన ఫామ్హౌస్ లో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో బేటీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
    కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంది :
    గజ్వేల్ నియోజకవర్గoలో సీఎం కేసీఆర్ వేల కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వాస్పత్రి, సమీకృత భవనాలు, కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ హబ్, సంగాపూర్ రోడ్డులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ, దేశంలోనే అతిపెద్ద నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్, రాజీవ్ రహదారి అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఆడిటోరియం, కోర్టు, బస్టాండ్ వంటి అభివృద్ధి పనులు కేటీఆర్ గనుక పోటీచేస్తే ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా గజ్వేల్ నియోజకవర్గoలోనే ఉండటం గమనార్హం.
    ఎంపీగా వంటేరుకు ఛాన్స్..?
    గజ్వేల్ నుంచి సీఎం పోటీ చేస్తే తాను టికెట్ అడగబోనని, ఆయన లేదా ఆయన తనయుడు కేటీఆర్ పోటీ చేయకపోతే తనకే టికెట్ ఇవ్వాలని వంటేరు ప్రతాపరెడ్డి పట్టుదలతో ఉన్నారు. కేసీఆర్ పోటీ చేస్తే ఆయన గెలుపునకే పనిచేస్తానంటున్నారు వంటేరు ప్రతాపరెడ్డి. సీఎం కేసీఆర్ కాకుండా మరెవ్వరికీ ఇచ్చినా వంటేరు పోటీ పడే అవకాశాలున్నాయి. కేసీఆర్ కాకుండా కేటీఆర్ పోటీ చేస్తే వంటేరు టికెట్ అడిగే అవకాశంలేదు. దాంతో ప్రతాప్ రెడ్డి, ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి పోటీ చేయనున్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు