- ఖమ్మం, సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ?
- ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు..
- గతంలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటు
- ప్రస్తుతం లాంగ్ లీవ్లో గడల శ్రీనివాస్ రావు
పబ్లిక్హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు కాంగ్రెస్వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి ఆయన సిద్ధమయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక టిక్కెట్ను ఆయన ఆశిస్తున్నారు. ఆయన తరుపున ఈ రెండు సీట్లకు శుక్రవారం గాంధీభవన్లో దరఖాస్తు చేశారు. పాపం కొత్తగూడెం టికెట్ కోసం కేసీఆర్కు వంగి వంగి దండాలు పెట్టిన శ్రీనివాసరావు ఎమ్మెల్యే అవ్వడం కోసం కొత్తగూడెంలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారాయన. ఇంతా చేస్తే ఆఖరి నిమిషంలో కేసీఆర్ ఈయనను కాదని వనమాకే టికెట్ ఇచ్చారు. అప్పట్నుంచి బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న శ్రీనివాసరావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలలో ఏదో ఒకటి ఆయన ఆశిస్తున్నారు. ఈ రెండు సీట్లకు శుక్రవారం గాంధీభవన్లో దరఖాస్తు కూడా చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను కాంగ్రెస్ నిలబెట్టందని, రాజకీయాలపై ఆసక్తి ఉన్న, ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న విద్యావంతులకు టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహిం చింది. 52మంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈనేపథ్యంలోనే ప్రజాసేవ, రాజకీయాలపై ఆసక్తి ఉన్న గడల శ్రీనివాస్రావు కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.. రాజకీయాల మోజును వదిలేస్తే శ్రీనివాసరావు సమర్థుడైన అధికారి. కరోనా సమయంలో తన పనితీరుతో అందరి మెప్పు సాధించారు. ఆ తర్వాత కూడా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కొత్తగూడెంకు చెందిన గడల, తన తండ్రి పేరిట ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. గడలకు కుల సమీకరణాలు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీసీ వ్యక్తికి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గడలకు ఇది కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. మరోవైపు, రాష్ట్రంలో మున్నూరు కాపు ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారు. రాష్ట్ర జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులకు ప్రాతినిథ్యం కల్పించాలను పార్టీ భావిస్తే, ఎక్కడో ఒకచోట గడలకు టికెట్ వచ్చే అవకాశం ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.