- మేము ఇచ్చిన మాటను ఎప్పుడు తప్పలేదు..
- ప్రతిపక్షాలవి దిగజారుడు రాజకీయాలు
- గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెడుతాం
- బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే వారి పథనానికి కారణం..
- దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎవ్వరు ఎవర్గ్రీన్ కాదు..
- రాష్ట్రంలో 15 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటాం
టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఆదాబ్ హైదరాబాద్ పొలిటికల్ కరెస్పాండెంట్ ప్రత్యేక ఇంటర్వ్యూ…
రాహుల్ గాంధీ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చా.. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ కాంగ్రెస్లో ఈ స్థాయికి చేరుకున్న.. నాకు గెలుపు ఓటములు అన్ని తెలుసు.. నా జీవితంలో ప్రశంశలు అందుకున్నాను.. విమర్శలు స్వీకరించాను.. కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముకుని ఉన్న.. పార్టీ పెద్దలు ఆదేశించిన విధంగా ముందుకు సాగుతా.. ఇక నేను పుట్టి పెరిగిన నియోజకవర్గం తుంగతుర్తి.. భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తోంది.. ఇక్కడ ప్రతీ నియోజకవర్గంలోని ప్రజల కష్ట సుఖాలు బాగా తెలుసు. ఇక్కడి బిడ్డగా చదువుకున్న యువతీ,యువకులు పడుతున్నబాధలు తెలుసు.. అక్కా చెల్లెళ్ళ సమస్యలు తెలుసు..పేదల కష్టాలు తెలుసు.. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనపై ప్రజలు పూర్తిగా విసిగిపోయి ఈ సారి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు..ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రతీ పక్షాలు ఈర్షపడేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అనుభవజ్ఞులైన మంత్రుల సారథ్యంలో సోనియా.. రాహుల్ ఆశీస్సులతో ప్రజలకు మెరుగయిన పాలనను తప్పక అందిస్తాం.. ప్రతిపక్ష నాయకులు పనిగట్టుకుని పసలేని రాజకీయం చేస్తున్నారు.. లేని అపవాదులను మూటగట్టి నిజాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.. వాళ్ళ ప్రవర్తనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సీఎం రేవంత్ పూర్తిగా పరిణితిచెందిన విజ్ఞానవంతుడు వారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారనడంలో కుంచిత్ సందేహం లేదు.. రైతులకు, బడుగు బలహీన వర్గాలకు యువతీ యువకులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలన్నింటిని నెరవేరుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం విషయంలో చక్కటి ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసుకుంది.. భవిష్యత్తులో ఇవే మా విజయానికి పునాది రాళ్లు అవుతాయి. నాపై నమ్మకం ఉంచి, భువనగిరి పార్లమెంట్ టికెట్ ఇస్తే నా శక్తి వంచన లేకుండా ప్రజాప్రతినిధులను కలుపుకుని పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల అభివృద్ధికి అవసరమైన వనరులు కేంద్రప్రభుత్వం నుంచి తెచ్చి భువనగిరి జిల్లాను అభివృద్ధి చేస్తా.. ఇక, బీఆర్ఎస్ రాష్ట్రంలో తుడుచుపెట్టుకుని పోయింది.. వాళ్ళు చేసిన, స్వయంకృత అపరాదాలు, తప్పులు, అవినీతిగా ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి.వాటిని ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు.. బీజేపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కాబట్టి కచ్చితంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని నమ్ముతున్నా.’ అని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ‘‘ఆదాబ్ హైదరాబాద్’’ పొలిటికల్ కరెస్పాండెంట్ వాసు కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు..
కాంగ్రెస్ గెలుపుకు ముందు గెలుపు తరువాత
పరిస్థితులను ఎలా చూడవచ్చు.. ?
కాంగ్రెస్ అధికారంలో ఉన్న లేకున్నా.. ప్రజలకోసం మాత్రమే పనిచేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ప్రజలను జాగృతం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు విధానాలను సరి చేస్తూ ప్రజలకు చక్కటి పరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తోంది.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి భాద్యత తెలిపేలా పనిచేశాం.. ప్రజలు అధికారం కట్ట బెట్టాక భాద్యతతో పనిచేస్తున్నాం.. మేము అధికారం శాశ్వతమని భావించడం లేదు.. కానీ ప్రజలకు మంచి చేస్తే శాశ్వతంగా అధికారంలోనే ఉంటామని ఖచ్చితంగా చెప్పగలము..
రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం..
రాహుల్ గాంధీ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చా .. ఆయనను దగ్గరగా చూసిన తరువాత అయనలా ప్రజలకు ఏదయిన మంచి చేయాలన్న తపన పెరిగింది.పదవి ఉంటేనే ప్రజలకు మంచి చేయగలుతామన్న స్లోగన్ నిజమని నేను ఎప్పటికి నమ్మను కానీ డబ్బుతో వెలకట్టలేని వెన్నో అధికారంలో ఉంటేనే చేయగలం అని నమ్ముతాను అందుకే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేయాలనుకుంటున్నాను. నిజానికి భువనగిరి లోక్ సభ స్థానం టికెట్ ఆశించి ఇటీవలే పార్టీకి దరఖాస్తు చేసుకున్నాను. పార్టీ పెద్దలు అవకాశం ఇస్తే పోటీ చేస్తా..
గెలుపుపై మీ పార్టీ కున్న అంచనాలేంటి ..
ప్రత్యర్థులెవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో 15 పార్లమెంట్ స్థానాలను మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటామన్న నమ్మకం ఉంది. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఎన్ని తప్పుడు కూతలు కూసినా ప్రజలు కాంగ్రెస్ తో ఉండాలని నిచ్చయించుకున్నారు.. కాంగ్రెస్ గతంలో అమలుచేసిన చారిత్రాత్మక పథకాలను ప్రజలు నేటికీ గుండెల్లో నిలుపుకున్నారు.. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఉచిత బస్సు ప్రయాణం వారికి వరంగా మారింది.. ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు కాంగ్రెస్ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతీ పక్షాలు పోటీ చేయాలంటే భయపడే పరిస్థితులు వచ్చిపడ్డాయి.. అందుకే ధీమాగా చెబుతున్నాం.. విజయం కాంగ్రెస్ అభ్యర్థులదే. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు,ప్రజలే బలం బలగం’..
ఈ విజయం రాష్ట్రానికే పరిమితమా..
కచ్చితంగా కాదు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాదని విపక్షాలు గొంతెత్తి చాటాయి..ఇంకా చాటుతూనే ఉన్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు.. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రియింబర్సుమెంట్ స్కీం ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.. పేదల పాలీట కల్పతరువు ఆరోగ్యశ్రీ అంటేనే తెలంగాణ ప్రజలు మరిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మేము ఇచ్చిన మాటనీ అప్పడు, ఇప్పుడు, ఎప్పుడు తప్పలేదు. పేదలకోసం కాంగ్రెస్ ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి కృషి చేస్తూనే ఉన్నది.. ఇటీవల స్టాఫ్ నర్సులకు ముఖ్యమంత్రి, వైద్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో 7000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమైనది. ఇదే సమావేశంలో మరిన్ని ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. అందుకే దైర్యంగా చెబుతున్నాం మా గెలుపు కేవలం రాష్ట్రానికే పరిమితమైయ్యింది కాదు..
ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ ఉండదని చెబుతున్నారు..
ఓడిపోయి అధికారానికి బీఆర్ఎస్ దూరమైన తరువాత ఆ పార్టీ నాయకులు అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు.. వారు అబద్దాలతో వారధిని నిర్మిస్తున్నారు.అది ఎక్కువ కాలం నిలబడదు.. ఇప్పటికే ఆ పార్టీ కార్యకర్తలు వారి అధినాయకత్వం తీరును ప్రశ్నిస్తున్నారు. తిరగబడుతున్న కార్యకర్తలకు మనోధైర్యం నింపడం కోసం ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ ఉండదని అబద్దాలను నిజాలుగా ప్రచారం చేస్తూ కాలం గడుతున్నారు.. ప్రజల మద్దతుతో సంపూర్ణమైన మెజార్టీతో మేము అధికారం చేపట్టాం..మా ప్రభుత్వానికి ఏ డోకా లేదు.. వారు చేసిన స్కాములు, మోసాలు బట్టబయలైతే ఆ పార్టీ మనుగడ కష్టమే.. నిజం నిలకడగానే తెలుస్తోంది.. ఆ పార్టీ కార్యకర్తలు నిజాన్ని తెలుసుకున్న రోజు వారి భ్రమలు తొలగిన రోజు ఆ పార్టీ భవిష్యత్తు కూడా తేలిపోతుంది..
ఎన్నికలకు కాంగ్రెస్ ఏ విధంగా సన్నద్ధమవుతున్నది?
రాష్ట్రంలో, దేశంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.. ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలం గ్రామీణస్థాయిలో మా పార్టీకి ఉంది. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేసే విధంగా కాంగ్రెస్ విజయం ఉండబోతుంది.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారాయి.ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు రాహుల్ ప్రధాని కావాలని, సోనియా నాయకత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు. రాబోవు ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం విశ్వాసం నాకుంది..
భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఎన్నికల ప్రణాళిక?
చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఎక్కడా.. తమ చదువులకు తగ్గ ఉపాధి అవకాశాలు దొరకడం లేదు.. మంచి మార్కులున్నప్పటికీ మంచి కంపెనీలలో అవకాశాలు రావడం లేదు.. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందించి వారు మంచి కంపెనీలలో ఉపాధి అవకాశాలు పొందేలా తోడ్పాటు అందిస్తాను.ఉన్నత విద్యాసంస్థలను నెలకొల్పి విద్యార్థుల చదువులకు బాసటగా నిలుస్తాను.. ఆత్మహత్యలు చేసుకునే రైతులకు ఆ తలంపు రాకుండా వారికీ కష్టంలో అండగా నిలబడతాను.. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అభివృద్ధికి కావాల్సిన నిధులను తెచ్చి గ్రామాల అభివృద్ధిలో భాగస్వామిని అవుతా..
ఏ పార్టీల మధ్య పోటీ ఉంటుందని మీరనుకుంటున్నారు..?
బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యన పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ శకం రాష్ట్రంలో,దేశంలో ముగిసిపోయింది.. ఆ పార్టీకి పోటీ చేయడానికే అభ్యర్థులు ముందుకు రావడం లేదని స్వంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.. ఇక గతంలో మాదిరి మోడీ చరిష్మా పనిచేయకపోవచ్చు.. దేశంలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడి పోయింది.. అందుకే దేశ ప్రజలు రాహుల్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు.. ఈ సారి రాహుల్ ప్రధాని కావడాన్ని ఎవ్వరు అడ్డుకోలేరని నేను అబిప్రాయపడుతున్నాను.