గోల్నాక శ్రీ సాయి దుర్గ బార్ అండ్ రెస్టారెంట్ ఆవరణలో కల్తీ కల్లు విక్రయాలు
- పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు
- కల్తీకల్లుకు బానిసలవుతున్న సామాన్యులు
- మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ
- గతంలో ఆన్ సేఫ్ అని నిర్ధారించిన
స్టేట్ ఫుడ్ లేబొరేటరీ - కల్లు కాపౌండ్ అనుమతులను
రద్దు చేయాలన్న స్థానికులు
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్): గోల్నాక (నల్లకుంట ఫూల్ బాగ్) శ్రీ సాయి దుర్గ బార్ అండ్ రెస్టారెంట్ ఆవరణలో ఉన్న కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు విక్రయాలు యదేచ్చగా జరుగుతున్న సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్ర వెల్లువెత్తుతున్నాయి. ఈ కాంపౌండ్లో కల్లులో క్లోరిన్ హైడ్రేడ్ లాంటి ప్రమాద భరితమైన మత్తు పదార్థాన్ని కలిపి కల్తీ చేసి కల్లుప్రియులకు అమ్ముతున్నారు. ఈ కల్తీ కల్లు మత్తుకు నిరుపేదలు, రోజువారి కూలీలు, కార్మికులు బానిసలు అవుతూ తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. అలాగే మహిళలు, చిన్న పిల్లలు సైతం కల్తీకల్లుకు అలవాటు పడుతున్నారు. ఈ కాం పౌండ్లో అమ్ముతున్న కల్తీ కల్లు తాగి నలుగురు వ్యక్తులు చనిపోయినట్లు తెలిసింది.
తాజాగా ఇదే కాంపౌండ్ లో వడ్లూరి గిరిబాబు (51) అనే పెయింటర్ కల్తీ కల్లు తాగి ప్రాణాలు కోల్పోయాడని వారు గుర్తు చేశారు. ఇంత పెద్ద ఎత్తున గోల్నాక తాడి కాంపౌండ్ లో బహిరంగంగా కల్తీకల్లు అమ్మకాలు జరుగుతున్న కాచిగూడ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదని వారు విమర్శిస్తున్నారు. గతంలో జిహెచ్ఎంసి డిజిగ్నేటెడ్ అధికారి సుదర్శన్ రెడ్డి ఈ కాంపౌండ్ లో కల్లు శాంపులను సేకరించి ల్యాబ్ కు పంపిం చారు. ల్యాబ్ రిపోర్టులో ఇక్కడ అమ్ముతున్న కల్లు కల్తీతో కూడుకు న్నదని (ఆన్ సేఫ్ ) నిర్ధారణ అయినప్పటికీ జిహెచ్ఎంసి అధికారులు కానీ, ఎక్సైజ్ అధికారులు కాంపౌండ్ యాజమాన్యం పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు హైదరాబాద్ నగరంలోని అన్ని కల్లు కాంపౌండ్లపై దాడులు నిర్వహించి కల్లు షాంపిల్ లను సేకరించి రాష్ట్ర ఫోరిన్సెస్ ల్యాబ్ కు పంపిం చారు. అందులో కొన్ని కల్లు కాంపౌండ్లలో కల్తీ కల్లు అమ్ముతున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసు లు సదరు కాంపౌండ్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అదేవిధంగా గోల్నాక కల్లు కాంపౌండ్లు కల్తీ కల్లు అమ్ముతున్నట్లు నిర్ధారణ కావడంతో కాచిగూడ పోలీసులు నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసిన ఇంతవరకు వారిని అరెస్టు చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటు ఎక్సైజ్ అధికారులు, అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కల్తీ కల్లు అమ్మకం దారుల పట్ల వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తుంది. అధికారుల నిర్లక్ష్యమే కల్లు ప్రియుల పాలుట శాపంలా మారిందని పలువురు పేర్కొంటు న్నారు. గోల్నాక తాడి కంపౌండ్ లో పెద్ద స్థాయిలో కల్తీ దందా కొనసాగుతున్న ఆబ్కారీ శాఖ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వారు విమర్శిస్తున్నారు. అబ్కారీ అధికారుల వైఖరి చూస్తుంటే కల్తీ దందాను పోత్సహిస్తున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయని వారంటున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం, ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కల్తీ కల్లు అమ్మకాలపై కఠినంగా వ్యవహరించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.