- అభిరుచులు మార్చుకుంటున్న కొనుగోలుదారులు..
హైదరాబాద్ : సొంతింటి విషయంలో కొనుగోలుదారుల అభిరుచి మారింది. ఏదో ఒక ఇంటిని కొనాలన్న ఆలోచన నుంచి నగరానికి కాస్త దూరమైనాసరే విశాలంగా, ప్రశాంత వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఆధునిక సాంకేతిక హంగులు, సౌకర్యాలు, భద్రత వంటి అంశాల్లోనూ రాజీ పడట్లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నగర శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీలకు ఆదరణ పెరుగుతున్నది. రియల్టర్లూ వీటికే పెద్దపీట వేస్తున్నారు. దీంతో హైదరాబాద్ మహానగరం.. లగ్జరీ హౌజింగ్కు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ సంస్థ విడుదల చేసిన తాజా త్రైమాసిక నివేదిక ఇదే చెప్తున్నది. హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ తీరుతెన్నులపై ఈ రిపోర్టు వచ్చింది. ఇందులో లగ్జరీ ఇండ్లదే హవా అని తేలగా, హైదరాబాద్ ముందు వరుసలో నిలిచింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఆర్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణె నగరాలపై తాజా సర్వే జరిగింది. ఈ నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్లో కొత్తగా మార్కెట్లోకి 1,16,220 యూనిట్లు అందుబాటులోకి రాగా.. ఇందులో రూ.40 లక్షలు, అంతకంటే తక్కువ ధర కలిగినవి (సరసమైన ధరల గృహాలు) 20,920గా ఉన్నాయి. ఇది 18 శాతానికి సమానం. కరోనాకు ముందు గరిష్ఠంగా కొత్త ఇండ్లు నమోదైన 2018 జూలై-సెప్టెంబర్లో మొత్తం 52,120 యూనిట్లకు 21,900 సరసమైన ధరల గృహాలే. ఇది 42 శాతానికి సమానం. 2019 జూలై-సెప్టెంబర్లోనూ 41 శాతంగా ఉన్నట్టు గుర్తుచేసింది. అయితే 2021 ఇదే వ్యవధిలో 24 శాతంగా ఉన్నాయని, ఈ ఏడాది ఇంకా తగ్గాయన్నది. ఫలితంగా కొత్త ఇండ్లు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్లో పెరిగినా.. వాటిలో సరసమైన ధరల గృహాల వాటా మాత్రం తగ్గినట్టు అనరాక్ చెప్పింది.