- కన్నెర్ర జేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి..
- ప్రభుత్వ భూముల వేలాన్ని వెతిరేకిస్తున్నాం..
- ఎన్నికల నిధుల సమీకరణ కోసమే వేలం..
- ఇప్పటికే రూ. 7000 కోట్లు సంపాదించారు..
- ఒకప్పుడు వ్యతిరేకించిన కేటీఆర్ ఇప్పుడు అదేపని చేస్తున్నారు..
- బీ.ఆర్.ఎస్. కాంగ్రెస్ కుమ్మక్కై భూములు అమ్ముతున్నారు..
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలాన్ని అడ్డుకుంటామని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆసైన్డ్ భూముల వేలం అత్యంత బాధ్యతారాహిత్యమని, కేవలం ఆదాయ సమీకరణ కోసం చేపట్టిన భూములను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలకు నిధుల సమీకరణలో భాగంగానే బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం భూములను విచక్షణ రహితంగా విక్రయిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలకు కేటాయింటిచ అసైన్డ్ భూములను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ లావాదేవీల కోసం లాక్కొంటోందని అంటూ దుయ్యబట్టారు. భూముల వేలం పాటతో ఇప్పటికే రూ. 7000 కోట్లు సంపాదించుకున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై భూములు పంచుకుంటున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే సైన్స్ సిటీకి భూమి ఇవ్వమంటే ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం 10 ఎకరాలు భూమి ఇచ్చారని విమర్శించారు. వైఎస్ హయాంలో భూములు అమ్మితే విమర్శించిన మంత్రి కేటీఆర్, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లే భూములు అమ్ముతున్నారని విమర్శించారు.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన భూములను అమ్ముకుంటూ పోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం అంటే, రాష్ట్రాన్ని అమ్మడమేనని అభివర్ణించారు. సంపదను సృష్టించకుండా, ఆస్తులను అమ్ముకుంటూ పోతే వ్యవస్థలన్నీ కుప్పకూలుతాయని అన్నారు. ఇలా భూములు అమ్ముకోవడం కోసమే ముఖ్యమంత్రి 80 వేల పుస్తకాలు చదివారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు..