- పటిష్ట అమలుకు కమిటీ ఏర్పాటు…!
- నేతృత్వం వహించనున్న ఎస్సీ
సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి..
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ఎరుకల సామాజిక వర్గం కోసం రూ.60 కోట్ల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకాన్ని ట్రైకార్ ద్వారా అమలు చేస్తూ.. పందుల పెంపకం సొసైటీలకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పందుల పెంపకం, స్టాటర్ హౌస్, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, రవాణా, పోర్క్ రిటైల్ మార్కెట్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం చేయనుంది. యూనిట్కు గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు 50 శాతం రాయితీ అందించనుంది. అందులో 40 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుల భాగస్వామ్యం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మంజూరు కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పథకం అమలు కోసం ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.