- అవినీతి పీఠంపై చిందేస్తున్న టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు
- ఇబ్రహీం బాగ్ సైబర్సిటీ సర్కిల్లో జోరుగా కొనసాగుతున్న అవినీతి దందా
- కిలోవాట్ (కెవి)ల చొప్పున వసూలు చేస్తున్న అధికారులు
- అక్రమాలకు తెరలేపిన అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ అంబేడ్కర్..!
- ప్రేక్షకపాత్రలో టీఎస్ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు
- అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారుల డిమాండ్
తెలంగాణ టీఎస్ఎస్పీడీసీఎల్ లో కొందరు అవినీతి అక్రమార్కుల శని ఇంకా వదలడం లేదు.. గత ప్రభుత్వంలోని కొందరు అవినీతి నాయకుల అండ చూసుకొని అక్రమ నియామకాలు చేస్తూ.. కోట్ల రూపాయల అవినీతికి తెర లేపి.. సంతలో సరుకులు అమ్మినట్లు అనర్హులకు ఉద్యోగాలు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు అప్పటి సీఎండి రఘుమా రెడ్డి, ఆయన తాబేదార్లు.. అంతేకాకుండా టీఎస్ఎస్పీడీసీఎల్ లో ఎల్ టి ఎం (అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్) కనెక్షన్లకు భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు బహిరంగ విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో టీఎస్ఎస్పీడీసీఎల్ జరిగిన అవినీతి అక్రమాలు ఇప్పటికీ జోరుగా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మారిన అధికారులు ఏవిధంగా తన అవినీతి గేమ్ ని నిర్భయంగా కొనసాగిస్తున్నారు అన్నది అంతుబట్టని విషయంగా మారింది.. టీఎస్ఎస్పిడిసీఎల్ ఇబ్రహీం బాగ్ సైబర్సిటీ సర్కిల్లో జోరుగా ఎల్టీఎం కనెక్షన్ల అక్రమాల దందా బాగోతం బట్టబయలైంది. ఈ అక్రమాలకు అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ అంబేడ్కర్ తెరలేపినట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాస్తవంగా వినియోగదారుడు ఎల్టీఎం కనెక్షన్ తీసుకోవాలంటే సేలడీడ్, ఐడీ ప్రూప్, మున్సిపల్ బిల్డింగ్ ప్లాన్ మరియు పర్మిషన్ ఉండాలి.. ఎన్ని వంటగదులు ఉంటే అన్ని కనెక్షన్లు మాత్రమే ఇవ్వాలి. కానీ, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించి వంట గదులు తక్కువ ఉన్న వినియోగదారుడితో లోపాయకారి ఒప్పదం చేసుకోని పదుల సంఖ్యలో కనెక్షన్లు ఇస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 20 కిలోవాట్స్ ఉంటే 25 కేవి ప్రపోజల్ కొరకు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు ప్రతిపాదిస్తారు. ఈ ప్రతిపాదనకు వినయోగదారుడు సుమారు రూ.1లక్ష 55 వేల నుంచి రూ.1 లక్ష 60 వేలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు 25కేవీ ఎల్టీఎం కనెక్షన్ ఇవ్వడానికి దాదాపు రూ. 1 లక్ష నుండి రూ. 1 లక్ష 50 వేల వరకు ముడుపులు తీసుకొని కనెక్షన్లు ఇవ్వడం గమనార్హం. 30 కిలోవాట్స్ నుండి 60 కిలో వాట్స్ వరకు ఉంటే 63 కేవి ప్రపోజల్ కు. రూ. 2 లక్షల 35 వేల నుండి రూ. 2 లక్ష 65 వేలు వినయోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు దాదాపు రూ. 2 లక్షల 50 వేల నుండి రూ. 3 లక్షల వరకు అధనంగా వసూలు చేస్తున్నారు. 100కేవీ అయితే రూ. 4 లక్షలు, 160 కేవీ అయితే రూ. 5 లక్షల నుండి రూ.5 లక్షల 50 వేల వరకు అధనంగా వసూలు చేస్తున్నారు. 315 కేవీ నుండి 500 కేవీ పైగా ఉంటే వినియోగదారుడు చెల్లించాల్సిన రుసుము రూ. 18 లక్షల నుండి రూ. 24లక్షలు మాత్రమే.. కానీ ఇక్కడ అధికారులు మాత్రము దాదాపు రూ. 10లక్షలు అధనంగా వసూలు చేయడం శోచనీయం.
ఒకవేళ వినయోగదారుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము చెల్లించినా, అధికారులకు అక్రమంగా చెల్లించాల్సిన ముడుపులు చెల్లించకుంటే ఏదో కారణం చేత ఎల్టీఎం కనెక్షన్ ప్రపోజల్ను రిజక్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు నల్లూరి సునీత ఎల్టీఎం కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకోగా, ముడుపులు చెల్లించనందుకు రిజెక్ట్ చేయడం జరిగింది. అదే సైట్ కు సంబంధించి కె. సతీష్ చంద్రగుప్తా ఎల్టీఎం కనెక్షన్కు దరఖాస్తు చేసుకోగా ముడుపులు తీసుకొని అట్టి కనెక్షన్ను టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు అప్రూవల్ చేశారు. అప్పడు ఆదే సైట్కు చెందిన నల్లూరి సునీత కనెక్షన్ ఎందుకు రిజక్ట్ చేశారో.. సతీష్ చంద్రగుప్తా ప్రపోజల్ను టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు ఎందుకు అప్రూవల్ చేశారో వారికే తెలియాలి.
ఇబ్రహీం బాగ్ సైబర్సిటీ సర్కిల్లో అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ అంబేడ్కర్ ఆ సర్కిల్లోని తన సొంత భవనానికి మున్సిపల్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా జి+5 పోర్లు అక్రమంగా నిర్మించి, టీఎస్ఎస్పీడీసీఎల్ నుండి ఎల్టీఎం కనెక్షన్ అక్రమంగా పొందడం జరిగింది. ఈ విధంగా సర్కిల్లో అనేక అక్రమాలకు తెరలేపుతూ.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు. ఈ అవినీతి దందాపై టీఎస్ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఇబ్రహీం బాగ్ సైబర్సిటీ సర్కిల్లోని మరిన్ని అవినీతి బాగోతాలు, ఇందులో ఎంత మందికి ఎంతెంత డబ్బులు చేతులు మారాయో.. పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానున్నది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవీనితిపై అస్త్రం…