- అవన్నీ ఊహాగానాలే అన్న బండి సంజయ్..
- అమిత్ షా, నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి..?
- ఎంతోమంది ప్రతిపక్ష నేతలు కలుస్తూనే ఉంటారు : బండి..
- తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదా..?
అని అనుమానం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీలోని కొందరు నాయకులు..
హైదరాబాద్: టీడీపీ తో బీజేపీ పొత్తు ఊహాగానాలేనని బీజేపీ నేత బండి సంజయ్ తోచిపుచ్చారు. కేంద్రమంత్రి అమిత్షా, బీజేపీ నేత నడ్డాలను టీడీపీ అధినేత చంద్రబాబు కలవడంలో తప్పేంటి? అని ప్రశ్నించారు. గతంలో పశ్చిమబెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ వంటి ప్రతిపక్ష నేతలు కూడా.. మోదీ, అమిత్షాలను కలిశారు కదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను, ప్రజలను కలవకుండా సీఎం కేసీఆర్ మాదిరిగా.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే పార్టీ బీజేపీ కాదని స్పష్టం చేశారు. ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సంజయ్ పేర్కొన్నారు. మరోవైపు టీడీపీతో బీజేపీ మళ్లీ జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు శనివారం రాత్రి అమిత్షాను కలిశారు. దాదాపు గంటకు పైగా ఆయనతో కీలక సమాలోచనలు జరిపారు. జేపీ నడ్డా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. వీరి మధ్య చర్చలు అత్యంత సుహృద్భావ వాతావరణంలో జరిగాయని తెలుస్తోంది. అయితే ఇవి ప్రాథమిక చర్చలు మాత్రమేనని, భవిష్యత్తులో మరింత నిర్మాణాత్మకంగా జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో.. తెలంగాణలో కూడా బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం కష్టమని ఆ పార్టీలో చేరిన నేతలే భావిస్తున్నారు.