- తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు..
- కావేరీ వాటర్ మేనేజ్మెంట్ ఇకపై కూడా చేపట్టాలని సూచన..
న్యూ ఢిల్లీ : కావేరీ నదీ జలాల వివాదంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీని కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ (సీడబ్ల్యూఆర్సీ), కావేరీ వాటర్ మేనేజ్మెంట్ (సీడబ్ల్యూఎంఏ) ఇకపై కూడా చేపట్టాలని జస్టిస్ బి.ఆర్.గవై నేతృత్వంలోని జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ పి.కె.మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. సీడబ్ల్యూఆర్సీ, సీడబ్ల్యూఎంఏ ప్రతి 15 రోజులకు క్రమం తప్పకుండా నీటి అవసరాలను తీరుస్తూ, పర్యవేక్షిస్తున్నాయని ధర్మాసనం తెలిపింది. తమిళనాడుకు కర్ణాటక ప్రతి రోజూ 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న వాదన అసంబద్ధం, అనవసరమైనది కాదని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ రెండు కమిటీలు అన్ని అంశాలను, ముఖ్యంగా కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాయని బి.ఆర్.గవై నేతృత్వంలోని ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది.
కర్ణాటక నుంచి తమ రాష్ట్రానికి 7,200 క్యూసెక్కుల నీరు అవసరమని సీడబ్ల్యూఆర్సీ మొదట నిర్ణయించిందని, కానీ అకస్మాత్తుగా నీటి మొత్తాన్ని రోజుకు 5 వేల క్యూసెక్కులకు తగ్గించిందని తమిళనాడు తరఫు న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ, జి. ఉమాపతి తమ వాదనలు వినిపించారు. బిలిగుందులు ప్రాజెక్టు వద్ద 5 వేల క్యూసెక్కుల నీటి విడుదలకు సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను సిడబ్ల్యుఎంఎ ధృవీకరించిందని అన్నారు. సిడబ్ల్యూఆర్సి నిర్ణయాన్ని సీడబ్ల్యూఎంఏ యాంత్రికంగా ఆమోదించిందని, కానీ రాష్ట్రంలో పంటల సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాల్సి ఉందని తమిళనాడు తరఫు న్యాయవాది రోహిత్గీ పేర్కొన్నారు.