- ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్..
- మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచింది..
- తెలంగాణ పోరాట యోధులను ప్రభుత్వం సమున్నతి రీతిలో స్మరించుకుంటుంది..
- సబ్బండ వర్గాల సంక్షేమమే మా ప్రభుత్వం ధ్యేయం : కేసీఆర్..
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఆమె కృషి, సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. సాయుధ ఉద్యమ సమయంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు ఎనలేనివని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రతి ఏటా ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని, తెలంగాణ పోరాట యోధులను ప్రభుత్వం సమున్నతి రీతిలో స్మరించుకుంటుందని తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమం, మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్ర సంక్షేమ, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరోవైపు మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఇది తెలంగాణ ప్రజలకు గర్వ కారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని, కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని, సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో మోడరన్ దోబి ఘాట్ను రజకుల సౌకర్యార్థం నిర్మించామని తెలిపారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేశామని మంత్రి హారీష్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.