- రాబోవు నాల్గు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు..
- పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..
- ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వాన..
- జలమయమై లోతట్టు ప్రాంతాలు..
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నాలుగు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నేటి నుంచి బుధవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు.. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలాఉంటే.. హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు ఎడతెరపిలేకుండా వర్షం కురవడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.