- ఇటీవల తెలంగాణ హైకోర్టు తుది తీర్పు
- స్టే ఎత్తివేసిన న్యాయస్థానం.. టీచర్ల బదిలీలకు తొలగిన అడ్డంకులు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు కసరత్తులు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2 నుంచి టీచర్ల బదిలీలు చేపట్టనుంది. ఈ మేరకు రేపు తెలంగాణ విద్యాశాఖ రేపు (శుక్రవారం) షెడ్యూల్ విడుదల చేయనుంది. టీచర్ల బదిలీలకు బుధవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అందుకోసం ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తున్నది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించనుంది. కాగా, తుది తీర్పునకు లోబడే టీచర్ల బదిలీలు జరగాలని హైకోర్టు ఆదేశించింది. కాబట్టి హైకోర్టు ఆదేశానుసారమే టీచర్ల బదిలీల ప్రక్రియ జరగనుంది. వాస్తవానికి, విద్యాశాఖ టీచర్ల బదిలీల షెడ్యూల్ను జనవరిలో విడుదల చేసింది. ఫిబ్రవరిలోనే బదిలీలు చేపట్టాల్సి ఉన్నది. 59 వేల మందికిపైగా టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఈ దశలో హైకోర్టు స్టే జారీచేయడంతో బదిలీలు నిలిచిపోయాయి. తాజాగా స్టే ఎత్తివేయడంతో బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపినట్టయింది. గతంలో బదిలీలకు కటాఫ్ తేదీని ఫిబ్రవరి 1గా ఖరారు చేశారు. తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 1గా నిర్ణయించారు. దీంతో జూలై 2015 తర్వాత వారు కూడా తప్పనిసరిగా బదిలీ అవుతారు.