Monday, May 13, 2024

సుప్రీంకోర్టు తీర్పునే కాలరాస్తారా?

తప్పక చదవండి
  • జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటి?
  • ఈ స్థలం కోసం ఎదురుచూసి 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారు
  • ఇంకెంత మంది చస్తే కనికరిస్తారు?
  • వేల కోట్ల విలువైన స్థలమైనందుకే కేసీఆర్ కుటుంబం కన్ను పడింది
  • ఈ స్థలాన్ని కొట్టేయడానికే కేసీఆర్ డ్రామాలాడుతున్నారు
  • జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది
  • సుప్రీంలో కోర్టు ఉల్లంఘన పిటిషన్ దాఖలు చేస్తాం : బండి..
  • పేట్ బషీరాబాద్ లోని జేఎన్ జేహెచ్ సొసైటీ స్థలం సందర్శన..

( మరో 5 నెలలు ఆగండి.. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ స్థలాన్ని జర్నలిస్టులకే స్వాధీనం చేస్తాం.. వీరితోపాటు తెలంగాణలోని జర్నలిస్టులందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం.. స్థానిక నేతలారా జర్నలిస్టుల పక్షాన కార్యాచరణ రూపొందించండి : బండి సంజయ్.. )

హైదరాబాద్,‘‘ జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటి? వాళ్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 10 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదు? సుప్రీంకోర్టు తీర్పునే కాలరాస్తారా? ఈ స్థలం కోసం ఎదురుచూసి ఇప్పటికే 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారు. ఇంకెంత మంది చస్తే కనికరిస్తారు?’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రోజు పేట్ బషీరాబాద్ కు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని సుప్రీంకోర్టు న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు హరీష్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలతో కలిసి సందర్శించారు. తమకు కేటాయించిన స్థలాన్ని బండి సంజయ్ కు చూపించిన జర్నలిస్టులు ప్రభుత్వం ఆ స్థలాన్ని అప్పగించకపోవడంతో జరుగుతున్న ఆక్రమణలకు చూపించారు. ఆ స్థలాన్ని కలియదిరిగిన బండి సంజయ్ అక్కడే ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రామచంద్రరావు, కూన శ్రీశైలంగౌడ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 70 ఎకరాలు స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ హౌజింగ్ సొసైటీ పేరుతో 1105 మంది జర్నలిస్టులకు కేటాయించింది. ఈ స్థలాన్ని అప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం 12 కోట్ల 50 లక్షల రూపాయలు కట్టి ఇక్కడున్న జర్నలిస్టులంతా స్థలాన్న కొనుగోలు చేశారు. ఆ పైసల కోసం ఆనాడు ఒక్కో జర్నలిస్టు ఇంట్లో అప్పు చేసి, పుస్తెలతాడు కుదువపెట్టి 2 లక్షలు జమ చేసి కట్టారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ కేసు తొలుత హైకోర్టుకు, తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లింది. 70 ఎకరాల స్థలం జేఎన్ జే సొసైటీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు 2017లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తరువాత గతేడాది ఆగస్టు 24న సుప్రీం కోర్టు ఇచ్చిన తుది తీర్పులో.. 70 ఎకరాలు స్థలాన్ని జేఎన్ జే హౌసింగ్ సొసైటీకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గారు ఆదేశించారు. ఈ స్థలాన్ని మరెవరికీ కేటాయించరాదని కూడా తీర్పులో స్పష్టంగా చెప్పారు. తీర్పు వచ్చి 10 నెలలైనా కేసీఆర్ సర్కారు మాకు పేట్ బషీరాబాద్ స్థలాన్ని ఎందుకివ్వలేదు. నేనడుగుతున్నా నిజాంపేట్ లోని 32 ఎకరాల స్థలాన్ని సొసైటీకి అప్పగించిన కేసీఆర్ … ఇప్పుడున్న ఈ పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని మాత్రం ఇంతవరకు అప్పగించకపోవడానికి కారణమేంటో సమాధానం చెప్పాలి. వీళ్లంతా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులు.. ఉండటానికి ఇల్లు లేక అద్దెకొంపల్లో జీవితాలను వెళ్లదీస్తూ సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు. వీళ్లంతా డబ్బులు కట్టి కొనుక్కున్న స్థలాన్నే ఇవ్వడం లేదంటే ఏమనాలి? ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన జర్నలిస్టులకే న్యాయం జరగడం లేదు. వీళ్లకు స్థలం ఇవ్వాల్సిందేనని.. ప్రజాస్వామ్య మూల స్థంభమైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయడం లేదంటే ఇగ సామాన్యుడిని పరిస్థితి ఏట్లుందో ఒక్కసారి అర్ధం చేసుకోవాలి. ఇంకా బాధాకరమైన విషయమేందంటే…. ఈ స్థలాల కోసం ఎదురు చూసి.. చూసి.. 1100 మంది సభ్యుల్లో ఇప్పటికే 60 మందికి పైగా చనిపోయారు. ఈ ఒక్క నెలలోనే ముగ్గురు జర్నలిస్టు మిత్రులు రామ్ ప్రసాద్, దొరై స్వామి, గోపరాజు మల్లపరాజు హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది. నిన్నగాక మొన్న 72 ఏళ్ల దొరైస్వామి స్థలాల కోసం జబ్బకు సంచి తగిలించుకుని ఎండలో రోజూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయిండు.‘‘పాపం 40 ఏళ్ల ఆయన జర్నలిజం సర్వీసులో రెండు జతల బట్టలు మినహా ఏమీ సంపాదించుకోలేదు. ఆదర్శంగా నిలిచారు. చివరి దశలోనైనా స్థలం వస్తే పిల్లలకు ఆసరాగా ఉంటుందని ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నరు. అయినా ప్రభుత్వానికి పట్టింపు లేదు. కమిటీ పేరు చెప్పుకుని కొందరు జర్నలిస్టులు బాగుపడ్డరు. ఎమ్మెల్యే, కార్పొరేషన్ పదవులు తీసుకున్నరు. వాళ్లే ఇట్ల చేస్తే… ఇక సామాన్యులకు దిక్కెవరు? ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే… కొందరు జర్నలిస్టులమని చెప్పుకునే వాళ్లు… ఎవరూ అక్కడికి వెళ్లొద్దు. బీజేపీ రాజకీయం చేయడానికే అక్కడికి వస్తోందని ఫోన్లు చేస్తున్నరట. అక్కడికి వెళితే సభ్యత్వం క్యాన్సిల్ చేస్తాం… మీకు స్థలాలు రావని బెదిరిస్తున్నరట. జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని ముందు వాళ్లకు తక్షణమే ఇచ్చేలా చేయండి. ప్రభుత్వానికి కూడా నేను చెబుతున్నా… వెంటనే సుప్రీం తీర్పును గౌరవించండి. లేకుంటే జర్నలిస్టుల పక్షాన ఉద్యమిస్తాం. న్యాయపోరాటం చేస్తాం. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు లో ధిక్కరణ పిటీషన్ వేస్తాం. జర్నలిస్టులకు స్థలాలిప్పించే వరకు అండగా ఉంటాం. ఒకవేళ మరో 5 నెలలు ఆగండి… అధికారంలోకి వచ్చేది బీజేపీ. మా పార్టీ అధికారంలోకి రాగానే ఈ స్థలాన్ని జర్నలిస్టులకు స్వాధీనం చేస్తామని హామీ ఇస్తున్నా. అంతేగాదు.. హైదరాబాద్ సహా తెలంగాణలో ఇళ్లులేక ఎదురుచూస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. జర్నలిస్టులు కూడా ఆలోచించండి…. చాట్ల తవుడు పోసి కొట్లాట పెట్టే రకం కేసీఆర్ ది. సీనియర్, జూనియర్ జర్నలిస్టుల పేరుతో మీ మధ్య కొట్లాటపెట్టి ఎవ్వరికీ ఇండ్లు ఇవ్వకుండా 2 వేల కోట్ల విలువైన ఈ స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నడు. మీరంతా కలిసి పోరాడండని పిలుపు నిచ్చారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు