Wednesday, May 15, 2024

దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేసుకున్న పుతిన్

తప్పక చదవండి
  • అరెస్ట్ చేస్తారని భయంతో నిర్ణయం
  • పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం
    ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో అంతర్జాతీయంగా ఒంటరిగా మారిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మరిన్ని కష్టాలు వెంబడిస్తున్నాయి. జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరు కానని పుతిన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దక్షిణాఫ్రికా వెల్లడించింది. పుతిన్ స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. బ్రిక్స్ సదస్సుకు హాజరు అవుతారని పేర్కొంది. పుతిన్‌పై 2023 మార్చిలో అంతర్జాతీయ న్యాయస్థానం – ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సమయంలో రష్యా దాటి దక్షిణాఫ్రికా వెళ్తే.. అక్కడే తనను అరెస్ట్ చేస్తారని పుతిన్ భయపడుతున్నట్లు సమాచారం. అందుకే ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
    ఆగస్టు 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో 15 వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. అయితే ఈ సదస్సుకు తాను హాజరవుతానని ఇటీవల పుతిన్‌ స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం – ఐసీసీ సభ్య దేశంగా ఉన్న దక్షిణాఫ్రికా కోర్టు ఆదేశాల మేరకు పుతిన్ తమ దేశంలో పర్యటిస్తున్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఈ దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పుతిన్‌ను జోహన్నెస్‌బర్గ్‌లో అరెస్టు చేస్తే రష్యాతో ప్రత్యక్షంగా యుద్ధాన్ని ప్రకటించినట్లు అవుతుందని గతంలో రష్యా చెప్పిన మాటలను ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోస గుర్తు చేశారు. ఒక వైపు అంతర్జాతీయ న్యాయ స్థానం అరెస్ వారెంట్.. మరోవైపు ప్రత్యక్ష యుద్ధం అన్న రష్యా హెచ్చరికలతో దక్షిణాఫ్రికా తీవ్ర ఆందోళనలో పడింది. ఈ విషయం పైనే ఇటీవల పుతిన్‌తో దక్షిణాఫ్రికా చర్చించినట్లు తెలుస్తోంది. చివరికి తమ సూచనతో రష్యా అధ్యక్షుడు.. జోహన్నెస్‌బర్గ్ పర్యటన రద్దు చేసుకున్నారని.. బ్రిక్స్ సదస్సులో పాల్గొనడం లేదని దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
    పుతిన్‌ను అరెస్టు చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసిన వారెంట్‌పై దక్షిణాఫ్రికాలోని ప్రతిపక్ష డెమోక్రటిక్‌ అలయెన్స్ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం అఫిడవిట్‌ సమర్పించింది. రష్యాతో యుద్ధం అనేది దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపింది. ఒకవేళ ప్రత్యక్ష యుద్ధం జరిగితే రష్యా – ఉక్రెయిన్‌ మధ్య శాంతి నెలకొల్పాలన్న దక్షిణాఫ్రికా ప్రయత్నాలు నిర్వీర్యం అవుతాయని వెల్లడించింది. అయితే ఆగస్టులో జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న 15 వ బ్రిక్స్ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా ప్రకటించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు