తిరువనంతపురం : వన్డే ప్రపంచకప్ను వర్షం నీడలా వెంటాడుతోంది. అక్టోబర్ 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. అంతకుముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్తో జరగాల్సిన భారత్ మొదటి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. నేడు తిరువనంతపురం లో నెదర్లాండ్స్ తో జరగబోయే చివరిదైన రెండో వార్మప్ మ్యాచ్కు కూడా వరుణుడు అడ్డుపడేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతుండటంతో టాస్ కాస్త ఆలస్యం కానుంది. ఇక హైదరాబాద్లో పాకిస్థాన్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయనుంది. పుష్కర కాలం తర్వాత భారత్లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ తొలి పోరులో (అక్టోబర్ 8న; చెన్నై వేదికగా) ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుండగా.. అంతకుముందు రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. అందులో భాగంగా గత శనివారం గువాహటిలో ఇంగ్లండ్తో ప్రాక్టీస్ పోరులో అస్త్రశస్త్రాలను సరిచూసుకుందాం అనుకుంటే.. వరుణుడు ఆ అవకాశమే ఇవ్వలేదు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ తర్వాత చినుకులతో ప్రారంభమైన వాన.. కాసేపట్లోనే మైదానాన్ని ముంచెత్తింది. దీంతో కీలక పోరును రద్దు చేయక తప్పలేదు. ఇప్పుడు తిరువనంతపురం మ్యాచ్కు కూడా వరుణుడు అడ్డుపడేలా కనిపిస్తున్నాడు.