సికింద్రాబాద్ : ప్రభుత్వం జీతాలను తగ్గిస్తూ జీవో విడుదల చేయడం పట్ల గాంధీ హాస్పిటల్ లోని ఔట్సోర్సింగ్ నర్సులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తమ విధులను బహిష్కరించి ఆదివారం ఆసుపత్రిలో ధర్నాకు దిగారు. ఈ సంద ర్భంగా పలువురు నర్సులు మాట్లాడుతూ తగ్గించిన జీతాలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. రూ.32 వేలు ఉన్న జీతాన్ని రూ. 25వేలకు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 16ఏళ్ల నుండి విధులు నిర్వహిస్తున్నామని, కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందించామని గుర్తు చేశారు. మూడు నెలలకు ఒకసారి జీతాలిస్తున్న ఓర్పుతో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. తమకు రెండు నెలల పాటు రాత్రి డ్యూటీలు వేయడం వలన తమ ఆరోగ్యాలు క్షీనిస్తున్నాయని అన్నారు. రెగ్యులర్ నర్సులకు నైట్ డ్యూటీలు వేయకుండా తమతోనే నైట్ డ్యూటీలు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ బాధలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడం కోసమే సమ్మె చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం దిగివచ్చి తమ జీతాలు పెంచి, తమని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మెను విరమించమని స్పష్టం చేశారు.