టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తోంది. గిల్.. నాలుగు రోజుల క్రితం డెంగ్యూ జ్వరం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆతడు ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేరాడు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో ప్రస్తుతం శుభ్మన్ గిల్ అడ్మిట్ అయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ కి చెందిన వైద్యుడు రిజ్వాన్ ఖాన్ కూడా శుభ్మన్ గిల్ వెంటే ఉన్నట్లు వారు తెలిపారు. ‘శుభ్మన్ గిల్ ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా అతన్ని చెన్నైలోని ఆసుపత్రిలో చేర్పించారు. బీసీసీఐ వైద్య బృందం అతడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది’ అని వెల్లడించాయి. కాగా, వన్డే ప్రపంచకప్లో భారత్ తలపడబోయే రెండో మ్యాచ్కు కూడా శుభ్మన్ గిల్ దూరమైన విషయం తెలిసిందే. ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో అప్ఘానిస్థాన్తో మ్యాచ్కు కూడా గిల్ను దూరం పెట్టినట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం టీమిండియాతో కలిసి చెన్నైకి చేరుకున్న గిల్కు తీవ్ర జ్వరం వచ్చింది. దాంతో ఆ మ్యాచ్ గిల్ దూరమయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఢిల్లీలో అఫ్ఘానిస్థాన్తో భారత్ తలపడబోతోంది. శుభ్మన్ గిల్కు జ్వరం పూర్తిగా తగ్గకపోవడంతో అఫ్ఘాన్తో మ్యాచ్కు కూడా అతడిని దూరం పెడుతున్నట్లు బీసీసీఐ ఇప్పటికే వెల్లడించింది.