- కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంటు ఉండదు
- బిజెపి ఎజెండా గుడి గోపురం కాదు… కులమతాల గొడవలు
- ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ సంక్షేమ ఫలాలు
- ఎన్నికల ప్రచారంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ : రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు సహా అనేక సంక్షేమ పథకాలను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆపుతున్న కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని, వారికి ఓటేస్తే కర్ణాటకలో మాదిరిగా కరెంటు ఉండదని రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇక బిజెపి ఎజెండా గుడి గోపురం కాదని, కులమతాల గొడవలు రాజేష్ ఓట్లు కొల్లగొట్టుకోవడమే వారి నైజం అని ఆయన తీవ్రంగా విమర్శించారు. మరోవైపు గత పదేళ్లుగా ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లిలో మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రికి మంగళ హారతులిచ్చి ఆహ్వానించారు. పిల్లలమర్రి రోడ్డు సమీపంలో ఓపెన్ టాప్ వాహనం ఎక్కి మంత్రి ప్రసంగించారు. ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ అందించిన ఏదో ఒక పథకం ద్వారా సహాయమందుతోందని… భవిష్యత్తులో కెసిఆర్ భరోసా ద్వారా సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోతామని తెలిపారు. రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.16 వేలు, దివ్యాంగులు, ఆసరా పింఛన్ పెంపు, అన్నపూర్ణ ద్వారా సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు రూ.3 వేలు జీవన భృతి, అసైన్డ్ భూములపై హక్కులు, జాబ్ క్యాలెండర్, రూ.400కే గ్యాస్ సిలిండర్ వంటి అంశాలను కేసీఆర్ భరోసా పేరిట ప్రజలకు వివరిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 11 పర్యాయాలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఆగం చేశారని, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గద్దల పాలు చేయొద్దని అన్నారు.