సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని వర్సిటీ వామపక్ష విద్యార్ది సంఘాలు హెచ్చరించాయి. వందేళ్ళ చరిత్ర గల ప్రతిష్టాత్మక ఓయూ భూములు కబ్జాలకు గురి అవుతున్నా, యూనివర్సిటీ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్ విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విలువైన ఓయూ భూముల కబ్జాకు రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారని, వారికి ఓయూ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆరోపించారు. భూ కబ్జాదారులను అడ్డుకొని చర్యలు తీసుకోవాల్సిన అధికారులే వారికి సహకరించడం సిగ్గుచేటు అన్నారు. ఓయూ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఓయూ విద్యార్థులకు కేసులు, జైల్లు కొత్తకాదని పేర్కొన్నారు. వర్సిటీ భూముల పరిరక్షణకు ఎంత దూరమైన వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవి నాయక్, నెల్లిసత్య, పిడిఎస్యు రాష్ట్ర నాయకులు శ్రీను, పిడిఎస్(వి) ఓయూ కన్వీనర్ బొడ్డుపల్లి అఖిల్, లెనిన్, మహేష్, కిషోర్, దిలీప్, శ్రీను, శర్మ తదితరులు పాల్గొన్నారు.