- వీఆర్ఏల సర్దుబాటు జీఓ ల రద్దు..
- యధాతధ స్థిఠీ కొనసాగించాలని ఆదేశం..
- ఈ మేరకు మధ్యాంత ఉత్తర్వులు జారీ చేసిన హై కోర్టు..
హైదరాబాద్ : తెలంగాణలో వీఆర్ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై జారీ చేసిన జీవోలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జీవోల జారీకి ముందు ఉన్న యథాతథస్థితిని కొనసాగించాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాలన్న ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నియామాకాలను అడ్డుకోవాలని రెవెన్యూ విభాగానికి చెందిన పలువురు ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టును ఆశ్రయించారు. జూనియర్ అసిస్టెంట్లుగా వీఆర్ఏల నియామకాన్ని ఆపాలని, దీనికి సంబంధించిన జీవో 81, 85లతో పాటు ఆగస్టు 5న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ 30 మందికి పైగా ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని వీఆర్ఏలకు పోస్టులను ఇవ్వడంపై తమకు అభ్యంతరంలేదని, అయితే తమకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో ప్రతివాదులుగా సీఎస్, ఆర్థికశాఖ, రెవెన్యూ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సీసీఎల్ఏలతోపాటు ముఖ్యమంత్రిని, ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా సృష్టించిన పోస్టుల్లో తమకు పదోన్నతులు కల్పించకుండా వీఆర్ఏలను నియమించడం తెలంగాణ సర్వీసు నిబంధనలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా వుంటే తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శు (జేపీఎస్)లను గ్రేడ్`4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ధేశించిన అంశాల్లో 70 శాతం స్కోర్ సాధించిన జేపీఎస్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలో అర్హులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. 70 శాతం మార్కులు రాని వారికి మరో ఆరు నెలలు అవకాశమిచ్చి, మళ్లీ ఆరు నెలల వరకు వారి పనితీరును పరిశీలించాక నియామకాలపై నిర్ణయం తీసుకోవాలంది..