- ఇటీవల తలసానిపై తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి
- నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం
- రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో గొల్ల కురుమలు, యాదవులు ధర్నా నిర్వహించారు. అంతేగాక రేవంత్ రెడ్డి పోస్టర్లోని అతని ముఖంపై దున్నపోతుల పెండ కొట్టి భారీ ర్యాలీ తీశారు. గొల్ల కురుమలు, యాదవులను కించపర్చేలా వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి తమకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్రెడ్డికి, ఆయన పార్టీకి తాము తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాగా, పేడ పిసుక్కుని బతికిన తలసాని శ్రీనివాస్ యాదవ్ నా గురించి మాట్లాడుతాడా అంటూ ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాంతో తమ జాతులను అవమానించారంటూ గొల్ల కురుమలు, యాదవులు ఆగ్రహం వ్యక్తం చేశారు.