న్యూ ఢిల్లీ : వెయ్యి రూపాయాల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. 2వేల నోట్లను ఉపసంహరించిన నేపథ్యంలో.. ఆ వత్తిడిని తట్టుకునేందుకు వెయ్యి రూపాయాల నోట్లను ప్రవేశపెడుతారా అని ఆర్బీఐ గవర్నర్ ను ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. రూ.1000 నోటును పున ప్రవేశపెట్టే ఆలోచన ఆర్బీఐ గవర్న్ స్పష్టం చేశారు. అది ఊహాజనితమని, తమ వద్ద అటువంటి ప్రతిపాదన లేదన్నారు. 2016, నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అప్పటి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ అర్ధరాత్రి నుంచే రూ.500, రూ. 1000 నోట్లు చెల్లవని చెప్పారు. ఆ కరెన్సీ చెల్లుబాటు కాదని చెప్పిన మోదీ.. ఆ నోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం చేయొచ్చని దానికి కొన్ని రోజుల గడువు ఇచ్చారు. ఇక నల్లధనం నియంత్రణ కోసమే అలా చేసినట్లు స్పష్టం చేశారు. అప్పుడు పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని రోజుల పాటు బ్యాంకుల ముందు జనం గుమిగూడాల్సి వచ్చింది. అదే సమయంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత.. సర్క్యులేషన్ కోసం రూ.500, రూ.2000 కొత్త నోట్లను ముద్రించారు. ఇప్పుడు రూ.2 వేల నోటు కూడా ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించి.. దీనిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు నాలుగు నెలల సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక దీనిని రద్దు చేయలేదని, ఈ కరెన్సీ చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. ఇండియన్ కరెన్సీ నిర్వహణా వ్యవస్థ బలంగా ఉందని… అందువల్ల ఈ నాలుగు నెలల్లో రూ. 2 వేల నోటు మార్చుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పారు.