- నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా
- బీఆర్ఎస్ ను నమ్మితే అభివృద్ధి శూన్యమే
- ప్రజాకర్షక పథకాలతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో
- సబ్బండ వర్గాల మద్దతు కాంగ్రెస్ కే ఉంది
- ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి మందుముల్ల పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది.. ఎమ్మెల్యే అభ్యర్థి మందుముల్ల పరమేశ్వర్ రెడ్డి గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారం చేస్తు ఉన్నారు. దీనికి తోడు వివిధ పార్టీల నాయకులు, అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరి తమ మద్దతు ప్రకటించడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం మరింతగా పెరిగిందని, అన్ని సామాజిక సబ్బండ వర్గాల మద్దతు పెరుగుతోందని పరమేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రచార గడువు పది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో బస్తీలు, కాలనీలు, మురికివాడ ప్రచారం వేగవంతం చేస్తున్నట్లు ఆయన వివరించారు. పరమేశ్వర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి, ఉప్పల్ కార్పొరేటర్ రజితా రెడ్డి కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి మందుముల్ల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. ఉప్పల్ అంటేనే అన్ని కులాలు, ప్రాంతాలు, మతాల వారుంటారని… అందుకే మినీ ఇండియా అని పిలుస్తారని, మినీ ఇండియాగా ఉన్న ఉప్పల్ లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని మరోసారి నిరూపించాలని ఎంపీఆర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాలు, మతాల సంక్షేమం చూసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని… మీ అందరికీ అందుబాటులో ఉండే తనకు చెయ్యి గుర్తుపై ఓటేసి గెలిపించాలని పరమేశ్వర్ రెడ్డి కోరారు.
తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి స్కీమ్, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పేరుతో ఆరు గ్యారంటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.. వాటిని నియోజకవర్గంలో గడప గడప కు, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విదంగా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విడుదల చేసిన 37 అంశాల మేనిఫెస్టోను ప్రజలకు అందేలా కృషి చేస్తానని అన్నారు. దళిత, గిరిజనులకు మేలు చేసేలా మేనిఫెస్టో ఉందన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేలా ఉందని చెప్పారు. పేదలకు భూములపై హక్కులు కల్పించేలా పలు అంశాలను పేర్కొన్నారు తెలిపారు.