- స్వయంగా ఎమ్మెల్యేనే కండువా కప్పిన వైనం..
- సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి..
- ఎమ్మెల్యే బలవంతంతోనే ఇలా చేశానంటున్న
ఫీల్డ్ అసిస్టెంట్ తాండ్ర మాణిక్యం..
వికారాబాద్ : కోటపల్లి మండల పరిధిలోని, బీరోల్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో 15ఏళ్లుగా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్న తాండ్ర మాణిక్యం, గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల కార్యకర్తలను బిఆర్ఎస్ పార్టీలో చేరుస్తూ.. ప్రచారకర్తగా మారడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత మూడు రోజుల క్రితం స్వయంగా ఎమ్మెల్యేనే ఫీల్డ్ అసిస్టెంట్ మాణిక్యంకు గులాబీ కండువా కప్పడం గమనార్హం. ప్రతిసారి అందరి కళ్ళుకప్పి తెరవెనుక బీఆర్ఎస్ కు ప్రచారం చేసే ఫీల్డ్ అసిస్టెంట్ మాణిక్యం గత మూడు రోజుల క్రితం కొంతమందిని ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుస్తూ నన్ను ఎవరేం చేస్తారు..? అన్న విధంగా ఏకంగా గులాబీ పార్టీ కండువా కప్పుకొని బిఆర్ఎస్ కార్యకర్త అవతారం ఎత్తాడు. ఈ విషయంపై మండల అధికారులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇట్టి విషయమై ఫీల్డ్ అసిస్టెంట్ మాణిక్యంను వివరణ కోరగా.. మండల పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే తనను బలవంత పెట్టినందుకు కండువా వేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.
తప్పక చదవండి
-Advertisement-