Saturday, April 20, 2024

కాంగ్రెస్ ఖతమై పోయింది..

తప్పక చదవండి
  • జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదు..
  • బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఓ సెక్షన్ మీడియా కుట్ర చేస్తున్నయ్
  • మీడియా బ్రేకింగులు పట్టించుకోవద్దు… అమిత్ సభను సక్సెస్ చేసి సత్తా చూపండి
  • ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల ఆగడాలతో ప్రజలు విసిగిపోయారు
  • బీఆర్ఎస్ బాధితుల సంఘం సమావేశం పెడితే స్టేడియం కూడా సరిపోదేమో
  • ఉమ్మడి ఖమ్మం ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు
  • బీజేపీ సింహం…సింగిల్ గానే పోటీ చేయబోతున్నాం
  • అధికారాన్ని కైవసం చేసుకుంటాం
  • ఖమ్మం ప్రిపరేటరీ మీటింగ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

హైదరాబాద్, ‘‘తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ యాడుంది? కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా దేశంలో ఎక్కడా ఆ పార్టీ లేదు.. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు.. కమ్యూనిస్టుల పనైపోయింది. సూది దబ్బడం పార్టీలని అవమానించిన కేసీఆర్ పంచనే చేరిన సిగ్గు, శరంలేని పార్టీల నేతలు కమ్యూనిస్టులు’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతోపాటు ఓ సెక్షన్ మీడియా కుట్ర చేస్తోందన్నారు. ఎవరెంత దుష్ప్రచారం చేసినా పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ సింహంలాంటి పార్టీ అని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

బండి సంజయ్ అధ్యక్షతన ఈ రోజు పట్టణంలోని వాసిరెడ్డి ఫంక్షన్ హాలులో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, జిల్లాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు పార్టీ తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, మాజీమంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎం. ధర్మారావు, కొండేటి శ్రీధర్, కుంజా సత్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ తోపాటు వివిధ జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యానారాయణ, కోనేరు చిన్ని, బొబ్బ భాగ్యారెడ్డి, రామచంద్రారెడ్డి, రావు పద్మ, కంకణాల శ్రీధర్ రెడ్డి, అధికార ప్రతినిధులు రాకేశ్ రెడ్డి, పాల్వాయి రజనీతోపాటు రాష్ట్ర నాయకులు గీతామూర్తి, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, కడగంచి రమేశ్, విద్యా సాగర్ రెడ్డి, ఉప్పల శారద తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు..

- Advertisement -

సర్దార్ పటేల్ గ్రౌండ్ కు అభినవ సర్దార్ పటేల్ రాబోతున్నడు…ఖమ్మంలో బీజేపీ సత్తా ఏందో ‘‘నిరుద్యోగ మార్చ్’’ ద్వారా చూపించాం. రేపు అమిత్ షా సభను సక్సెస్ చేసి మరోసారి దమ్ము చూపిద్దాం. కమ్యూనిస్టు పార్టీలు కాలగర్భంలో కలిసిపోయారు. ఆ పార్టీలను సూది దబ్బడం పార్టీలని అవమానించిన కేసీఆర్ పంచనే కమ్యూనిస్టులు చేరారంటే వాళ్లకు సిగ్గు శరం లేదని అర్ధమైతోంది. తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ యాడుంది? కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా దేశంలో ఎక్కడా ఆ పార్టీ లేదు.. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు.. అన్ని ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు.. ఏదీ చేతగాని నపుంసకుడు పెళ్లి చేసుకుంటే ఏమైతది… కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఓ సెక్షన్ మీడియా బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నయ్. కర్నాటక ఫలితాలను బూచీగా చూపి బీజేపీ పనైపోయిందని దుష్ప్రచారం చేస్తోంది. బీజేపీ కార్యకర్తలెవరూ పట్టించుకోవద్దు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ సక్సెస్ తో కేసీఆర్ కళ్లు బైర్లు కమ్మినయ్. మళ్లీ 15న అమిత్ షా వస్తున్నారని తెలుసుకుని కేసీఆర్ కు చెమటలు పడుతున్నయ్. ఇక్కడ అమిత్ షా సభ సక్సెస్ అయిన తరువాత అవసరమైతే ప్రధాని మోదీగారి సభను కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తాం. అందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. ఖమ్మం జిల్లాలో కూడా 70 శాతం పోలింగ్ బూత్ కమిటీలను పూర్తి చేశాం. తెలంగాణలో రాబోయేది కాషాయ రాజ్యమే. గడీల రాజ్యాన్ని తరిమితరిమి కొట్టడానికి ఇంకా 5 నెలలే టైముంది.

గతంలో బీజేపీని ఉరికించి కొడతామన్న నేతలకు మన సత్తా తెలిసి నోరు మూసుకున్నరు. ఎక్కడ చూసినా జనం బీజేపీ పేరే ఉచ్చరిస్తున్నరు. ఆ పార్టీ జోలికి పోతే ప్రజలే తిరగబడతారనే భయం బీఆర్ఎస్ నాయకులకు పట్టుకుంది. కొట్లాట గురించి మాట్లాడే బీఆర్ఎస్ నేతలు ఈ జిల్లాలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో సమాధానం చెప్పాలి. ఈ జిల్లా బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయించాలి. ఈ జిల్లాలో బీఆర్ఎస్ నేతల అరాచకాలకు అంతులేదు. బీఆర్ఎస్ బాధితుల సంఘం సమావేశం పెడితే… సర్దార్ పటేల్ స్టేడియం కూడా సరిపోదు… బీఆర్ఎస్ మీద అంత కసితో ఉన్నారు..కొంత మంది పోలీసులు బీఆర్ఎస్ కు తలొగ్గి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. మీరు బెదిరిస్తే భయపడే కార్యకర్తలు బీజేపీలో లేరు. ఖమ్మం జిల్లాలో నేతల ఆగడాలకు బలైపోయిన సాయి గణేష్ త్యాగాలను వ్రుధా పోనీయ్యం. తప్పకుండా బీఆర్ఎస్ సంగతి చూస్తాం. అందులో భాగంగా ఈనెల 15న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి. మహజన్ సంపర్క్ అభియాన్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనా ఫలితాలపై ఇంటింటికీ తీసుకెళ్లాలి. తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి అధికారమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సీఎంసహా మంత్రులు జిల్లాల్లో పర్యటించాలంటే బీజేపీ కార్యకర్తలను చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది. అందుకే ముందస్తుగా అరెస్ట్ లు చేస్తున్నారు. పోడు భూములు, 317 జీవో, రైతు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలు చేసి జైలుకు వెళ్లిన పార్టీ బీజేపీ. బీఆర్ఎస్ నేతల ఆగడాలు ప్రజలు భరించలేకపోతున్నారు. ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు. సీఎం ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చి ఇఛ్చిన హామీలొక్కటీ అమలు కాలే. భద్రాచలం రామాలయం అభివృద్ధికి కేసీఆర్‌ ఇస్తామన్న 100 కోట్లు నిధులు ఇవ్వలేదు. వరదలప్పుడు కరకట్ట నిర్మాణానికి 1000 కోట్లు ఇస్తాన్న హామీ అమలు కాలేదు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం జరగలేదు. కరసేవకుల త్యాగాలు వ్రుధా కాకూడదని రామజన్మ భూమి నిర్మిస్తున్న ఘనత ప్రధాని మోదీదైతే… భద్రాచలం సీతారాముడి కళ్యాణానికి తలంబ్రాలు కూడా తీసుకెళ్లని చరిత్ర కేసీఆర్ ది. ఎవరు నిజమైన రామభక్తులో చెప్పాలి.
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో సింగిల్ గా పోటీ చేస్తాం. గెలిచి సింగిల్ గానే అధికారాన్ని కైవసం చేసుకుంటాం. మీడియాలో బ్రేకింగుల పేరిట జరుగుతున్న షేకింగులను పట్టించుకోవద్దు. అందరూ కష్టపడి ఇష్టపడి పనిచేసి కాషాయ రాజ్య స్థాపనకు క్రుషి చేయాలి. అందులో భాగంగా 15న జరిగే సభను విజయవంతం చేయాలి. ఖమ్మంలో బీజేపీ ఎక్కడిది? సభ సక్సెస్ అయితదా? అని చాలామంది అంటున్నారు. ఇది మీకు అవమానకరం. మీ దమ్మేందో చూపించే రోజు రాబోతోంది. ఎవడన్నా బీజేపీ ఖమ్మంలో లేదని చెబుతోంది. నిరుద్యోగ మార్చ్ తో మా సత్తా చూపాం. తెలంగాణ ప్రజల గుండెల్లో బీజేపీ ఉంది అన్నారు బండి సంజయ్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు