Saturday, May 11, 2024

కేసీఆర్ కొడకా.. తెలంగాణకు ఎవరేం ఇచ్చారో తేల్చుకుందామా..?

తప్పక చదవండి
  • భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా?
  • మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది?
  • మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది?
  • నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలే…
  • అనుమతి తీసుకోకుంటే మున్సిపాలిటీల్లో ఇంటికే పర్మిషన్ ఇవ్వరు
  • మరి డీపీఆర్ కూడా సమర్పించని పాలమూరుకు జాతీయ హోదా ఎట్లా సాధ్యం?
  • ఒక్క మోటార్ తో పాలమూరు ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లెట్లా సాధ్యం
  • కుల వ్రుత్తుల కంచంలో అన్నం మెతుకైన కొండా లక్ష్మణ్ బాపూజీ
  • బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారమే బాపూజీ లక్ష్యం : బండి సంజయ్..

( టీఆర్ఎస్ కోసం ఇంటిని త్యాగం చేస్తే… ఆయననే అవమానించిన మూర్ఖుడు కేసీఆర్, బాపూజీ ఆత్మ క్షోభిస్తోంది…..పద్మశాలీ జాతి మిమ్ముల్ని క్షమించదు.. : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్.. )

హైదరాబాద్: ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు ఎందుకు రాకూడదు? కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్ల రూపాయలిచ్చింది. మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? అంతెందుకు? తెలంగాణకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా? డేట్, టైం ఫిక్స్ చేయండి. పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్దకు కిషన్ రెడ్డిని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా.. నువ్వో లేక మీ అయ్యో బహిరంగ చర్చకు సిద్ధమా? ఇదే ఎన్నికల రెఫరెండంగా తీసుకుందాం. నిజంగా కేసీఆర్ కొడుకువే అయితే.. నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే నా సవాల్ ను స్వీకరించాలి ’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ బుధవారం రోజు మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ప్రధానిని విమర్శించే కనీస అర్హత కేసీఆర్ కొడుకుకు లేదని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ లేకుంటే నీకున్న అర్హత ఏంది? మోదీ, కిషన్ రెడ్డి నీ లెక్క అయ్య పేర్లు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు.. పదవులు సంపాదించలేదు? తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అవమానించిన మూర్ఖుడివి నువ్వు’’ అంటూ దుయ్యబట్టారు.

- Advertisement -

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం రోజు కరీంనగర్ లోని కోతిరాంపూర్ చౌరస్తా వద్దనున్న లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాపూజీ సేవలను స్మరించుకున్నారు. అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమ పతాక… సహకారోద్యమ నేత…. నిజాం వ్యతిరేక ఉద్యమ నేత… తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ….నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు బాపూజీ. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన నాయకుడు. చేనేత, చేతివృత్తుల కార్మికుల కంచంలో అన్నం మెతుకుగా మారిన మానవతావాది కొండా లక్ష్మణ్ బాపూజీ. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ టోపీ పెట్టుకుని ‘సిటిజన్‌ ప్రొటెక్షన్‌ కమిటీ’ పేరుతో పౌర హక్కుల కోసం పోరాడి అనేక సార్లు జైలుకు వెళ్లిన యోధుడు బాపూజీ. ఆధిపత్యాన్ని సహించని వ్యక్తిత్వం బాపూజీ సొంతం. తన జీవితమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం అనే లక్ష్యాల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.
నిజాం రాజును అంతమొందిస్తే తప్ప హైదరాబాద్‌ సంస్థాన ప్రజలకు విముక్తి లేదని భావించిన బాపూజీ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌పై బాంబు దాడికి వ్యూహం రచించి అమలు చేసిన వ్యూహకర్త బాపూజీ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధించబడిన నాయకులకు పార్టీలతో నిమిత్తం లేకుండా ఉచిత న్యాయ సహాయం అందించిన గొప్ప న్యాయవాది బాపూజీ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యునిగా మచ్చలేని నాయకుడిగా సేవలందిస్తూ ఈ తరం నాయకులకు స్పూర్తిగా నిలిచిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.

తెలుగు నేలపై సైకిల్‌ యాత్ర, పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన మొట్ట మొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీయే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూడిన నాయకుడు కొండా లక్ష్మణ్‌. ‘తెలంగాణ పీపుల్స్‌ పార్టీ’ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటిన బాపూజీ నివాసమైన ‘జలదృశ్యం’ లోనే టీఆర్ఎస్ పురుడు పోసుకుంది.
తెలంగాణ నినాదం ఎత్తుకున్న దేవేందర్‌ గౌడ్‌, ఆలె నరేంద్ర, గద్దర్‌, విమలక్క లాంటి వారందరికీ అండగా నిలిచిన బాపూజీ 96 సంవత్సరాల పండు ప్రాయంలో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో తెలంగాణ కోసం దీక్ష చేశారంటే బాపూజీకి తెలంగాణపట్ల ఉన్న చిత్తుశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? బాపూజీ విలువలు, త్యాగం, పట్టుదల, నిజాయితీ, పోరాట స్పూర్తి నేటి తరానికి ఆదర్శనీయం.

దురదృష్టం ఏమిటంటే.. అన్నం పెట్టిన చేతులకే సున్నం పెట్టే కేసీఆర్ చెరలో తెలంగాణ తల్లి బంధీగా మారింది. ఆనాడు టీఆర్ఎస్ కు పురుడు పోసిన కొండా లక్ష్మణ్ బాపూజీని అవసరానికి వాడుకుని వదిలేసిన దుర్మార్గుడు కేసీఆర్. ఏనాడు బాపూజీ జయంతి, వర్ధంతులకు హాజరుకాని కేసీఆర్ ఎన్నికలొస్తున్నయని తెలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారంటే.. ఎంతటి అవకాశవాదో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీపట్ల నిజంగా ప్రేమ ఉంటే 9 ఏళ్లపాటు ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. తప్పు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.
తెలంగాణలో ప్రధాని మోదీ అడుగు పెట్టకూడదని కేసీఆర్ కొడుకు అంటున్నడు. నేనడుగుతున్నా.. తెలంగాణలో ఎందుకు రాకూడదు. బరాబర్ వస్తడు. తెలంగాణకు 9 లక్షల కోట్లు ఇచ్చినం. మరి మీరేం చేసిర్రు. రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల రూపాయల అప్పులపాలెందుకు చేసినవ్? ఇచ్చిన హామీలెందుకు నెరవేర్చలేదు? పాలమూరును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి వంచించిన మూర్ఖుడు మీ అయ్య. పాలమూరులో వలసల్లేవని దొంగ మాటలు చెబితే… వలసలున్నాయని నా పాదయాత్రలో నేనే నిరూపించిన. ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా పొట్ట కూటి కోసం ముంబయ్, సూరత్ పోతున్నారని మీడియా సాక్షిగా నిరూపించిన.
క్రిష్ణా నది ద్వారా తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉంటే… అప్పటి ఏపీ ముఖ్యమంత్రితో కుమ్మక్కై 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం చేసింది నిజం కాదా? నిరూపించేందుకు నేను సిద్ధం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి డీపీఆర్ సమర్పించకుండానే జాతీయ హోదా ఇవ్వడం ఎలా సాధ్యం? మున్సిపాాలిటీ, గ్రామ పంచాయతీల్లో అనుమతి లేకుండా ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వరు. అట్లాంటిది పాలమూరు ప్రాజెక్టు కోసం డీపీఆర్ ఇవ్వకుండా జాతీయ హోదా ఎట్లా సాధ్యం? ఇంకా నవ్వొచ్చేదేమిటంటే… పాలమూరు ప్రాజెక్టు కు మొన్న ఒక్క మోటార్ ప్రారంభించి 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తారట. అంతటి అద్బుతాలు స్రుష్టించడానికే పుట్టిన వ్యక్తి కేసీఆర్. నేనడుగుతున్నా మోదీ తెలంగాణకు ఎందుకు రావొద్దు? కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో 9 లక్షల రూపాయలు ఇచ్చింది. బరాబర్ తెలంగాణకు వస్తరు. నేను సవాల్ చేస్తున్నా… తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధం…. మరి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలెన్ని? ఎన్ని అమలు చేసినవ్? రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా ఎందుకు మార్చినవ్. కుల వ్రుత్తులుసహా అన్ని వర్గాలను ఎందుకు మోసం చేసినవో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమా? బీజేపీ తరపున కిషన్ రెడ్డి ని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకువైతే నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి చర్చించేందుకు సిద్దమా? కేసీఆర్ కొడుకుకు కండకావరమొక్కి ప్రధానిపై మాట్లాడుతున్నరు. సొంత పార్టీ నేతలే ఆయన భాషను చూసి చీదరించుకుంటున్నరు.నీకు నౌకర్లు ఇచ్చే దమ్ములేదు… పరీక్షలు నిర్వహించే దుస్థితిలో ఉన్నవ్. పరీక్షలను రద్దు చేసి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నవ్. నిరుద్యోగుల, రైతులుసహా అన్ని వర్గాల పొట్ట కొడుతున్న మీకు ప్రగతి భవన్ దాటి బయటకు అడుగుపెట్టే అర్హత లేదు అని విమర్శించారు బండి సంజయ్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు