- పోలీసులపై అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్
- పాతబస్తీ నుంచి పరిగెత్తిస్తానని మాస్ వార్నింగ్
- ఎంఐఎం నేత అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు
ఎన్నికల ప్రచారంలో పోలీసు ఇన్స్పెక్టర్ను బహిరంగంగా బెదిరించినందుకు చంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్ధీన్ ఓవైసీపై కేసు నమోదైంది. తాను ఒక్క సైగ చేస్తే.. ఇక్కడి నుంచి పరుగులు పెడతారు అంటూ అక్బరుద్ధీన్ ఓవైసీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రాయణగుట్ట నియోజకవర్గం సంతోష్నగర్ పీఎస్ పరిధిలో మంగళవారం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రచారం నిర్వహించటానికి సమయం ముగిసిందని సంతోష్నగర్ ఇన్స్పెక్టర్ పి.శివచంద్ర అక్బరుద్దీన్ ఒవైసీకి చెప్పారు. దీంతో ఒక్కసారిగా అక్బరుద్దీన్ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రచార సమయానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందని, ముందే ప్రచారాన్ని ఎలా ఆపుతారంటూ ఇన్స్పెక్టర్పై మండిపడ్డారు. స్టేజ్ మీద నుంచి సీఐ వైపు వెళ్లి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
‘మీ దగ్గర గడియారం లేకపోతే నా వాచ్ మీకిస్తా టైమ్ చూసుకోండి. నాపై తూటాలు, కత్తులతో దాడులు జరిగాయి. అంతమాత్రాన అలసిపోయానని అనుకుంటున్నారా? దయచేసి నన్ను రెచ్చగొట్టొవద్దు. పెద్ద ఏదో చెప్పడానికి వచ్చి నిలబడ్డావ్.. ఐదు నిమిషాలు ఇంకా సమయం ఉంది. ఖచ్చితంగా నేను మాట్లాడి తీరుతా. నన్ను ఆపే ధైర్యం ఎవరికీ లేదు.. ఉండబోదు. నేను చంద్రాయణగుట్ట నియోజకవర్గ ప్రజలకు ఒక్క సైగ చేస్తే.. పోలీసులంతా ఇక్కడి నుంచి పరుగులు పెడతారు. పరుగెత్తించి చూపించమంటారా?’ అని పోలీసులకు అక్బరుద్దీన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అయింది.