- ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి మార్క్..
- ఏడుగురు ప్రభుత్వ సలహాదారుల నియామకాల రద్దు
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
- మూడో రోజే రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్ : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తనదైన మార్కు పాలన ప్రారంభించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే సచివాలయానికి వచ్చారు. విద్యుత్ శాఖపై సమీక్షలు నిర్వహించారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిమామయకమైన కార్పొరేషన్ల ఛైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న అధికారులు, లీడర్లు వారి వారి పోస్టులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రేవంత్ రెడ్డి సర్కారు రద్దు చేసింది. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో సోమేశ్కుమార్, చెన్నమనేని రమేష్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జీఆర్ రెడ్డి, ఆర్.శోభ.. ప్రభుత్వ సలహాదారులుగా నియామకం కాగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. అయితే.. వీరి స్థానంలో వేరే వారిని నియమించుంకుంటారా.. లేదా పూర్తిగా రద్దు చేసినట్టేనా అన్నది తెలియాల్సి ఉంది. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎస్లుగా సేవలందించిన అధికారులతో పాటు వివిధ హోదాల్లో పని చేసిన ఐఏఎస్ల పనితీరు నచ్చిన అప్పటి సీఎం కేసీఆర్.. వారిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్నారు. కాగా.. వీరిపై గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేసీఆర్కు అనుగుణంగా పనిచేసే అధికారులందరినీ.. తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఐడుగురి నియామకాలు రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.