Sunday, May 5, 2024

కేటీఆర్‌వి పగటి కలలు

తప్పక చదవండి
  • రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాదు
  • నిరుద్యోగుల పాలిట యమపాశంలా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
  • అప్పుడే టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఎందుకు చేయలేదు
  • మళ్లీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామనటం హాస్యాస్పదం
  • ఇప్పుడు ఎన్నికల సమయంలో కావడంతో కొత్త రాగం
  • తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేసేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ధీటుగా సంసిద్ధమౌతోంది. అధికారమే పరమావధిగా ఎన్నికల సమరంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పావులు కదుపుతోంది. బీజేపీ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థుల ప్రకటన చేయక పోయినా.. ప్రచారాన్ని మాత్రం ఉధృతం చేసింది. తాజాగా అధికార పార్టీ మంత్రి కేటీఆర్‌ చేసిన వాగ్దానాలను తిప్పికొడుతూ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కుంభకోణంపై మంత్రి కేటీఆర్‌కు కిషన్‌ రెడ్డి చురకలాంటించారు. టీఎస్‌పీఎస్‌సీ కుంభకోణంపై దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుందన్నారు. ఎన్నికల తర్వాత డిసెంబర్‌ మూడో తేదీ ముఖ్యమంత్రి అయినట్లు కేటీఆర్‌ పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. కుంభకోణం జరిగినప్పుడు టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుంభకోణం జరిగినప్పుడు నాకేం సంబంధమని వితండవాదం చేసిన కేటీఆర్‌ ఇప్పుడెలా ప్రక్షాళన చేస్తారని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కావడంతో కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి కేటీఆర్‌ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం ప్రగతి భవన్‌ వదిలి ఫాంహౌస్‌కు పరిమితం కావటం ఖాయమని అన్నారు. కేసీఆర్‌కు యువతపై నిజంగా ప్రేమ ఉంటే ఉద్యోగాలను భర్తీ చేసేవారని.. కేసీఆర్‌ సర్కార్‌ కారణంగానే 30లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆక్షేపించారు. నిరుద్యోగుల పాలిట బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, టీఎస్‌పీఎస్‌సీ యమపాశంలా తయారైందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే క్యాలెండర్‌ ప్రకటించి.. ఆ ప్రకారం భర్తీ ప్రక్రియ నిర్వహిస్తామని కిషన్‌ రెడ్డి తెలిపారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కేటీఆర్‌ ఇప్పుడు అంటున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఎందుకు ప్రక్షాళన చేయలేదు. పేపర్లు లీక్‌ అయిన వెంటనే.. టీఎస్‌పీఎస్‌స్సీని ఎందుకు రద్దు చేయలేదు. నెలక్రితం వరకు టీఎస్‌పీఎస్సీతో మాకేం సంబంధం లేదన్నారు. మాకేం సంబంధం లేదన్న వ్యక్తి డిసెంబర్‌ 3 తర్వాత ఎలా ప్రక్షాళన చేస్తారు. తన తండ్రి స్థానంలో తానే ముఖ్యమంత్రి అయ్యినట్లు.. కేటీఆర్‌ పగటికలలు కనటం మానుకోవాలి. నిరుద్యోగులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఉద్యోగాలు భర్తీ చేసేవారని అన్నారు. నవంబర్‌ 1న జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు