- చీర్యాల్లో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు..
- నోటిసులిచ్చి సరిపెడుతున్న అధికారులు..
- ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆదాయ వనరులుగా మారిన అక్రమ నిర్మాణాలు..
కీసర : చీర్యాల్ గ్రామపంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు జిల్లా, మండల పంచాయతీ అధికారులు సంపూర్ణ సహకారం అందజేస్తున్నారు. గ్రామంలోని సర్వే నంబర్లు 330, 331, 332, 333, 334, 335, 336 లలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు పంచాయతీ అధికారులకు ఆదాయ వనరులుగా మారడం కారణంగానే వాటిపై చర్యలకు ఉపక్రమించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో అక్రమార్కులు యధేచ్ఛగా నిర్మాణాలు జరుపుతూ వాటిని సామాన్య ప్రజలకు అంటగడుతున్నారు.
ఆదాయ వనరులుగా అక్రమ నిర్మాణాలు : చీర్యాల్ గ్రామంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఒక్కో ఇంటి నిర్మాణానికి బిల్డర్ల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. దర్జాగా కొనసాగుతున్న అనుమతి లేని ఇండ్ల నిర్మాణాలు ఈ విమర్శలను నిజం చేస్తున్నాయి. తమ పాలకవర్గం సమయం ముగుస్తుండడంతో ప్రజా ప్రతినిధులు అందినకాడికి దండుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చీర్యాల్ గ్రామంలో జరుగుతున్న అక్రమాలపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని, గ్రామ పంచాయతీ ఆదాయం పక్కదారి పట్టకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.