- నిజాంపేట్ కార్పొరేషన్లో దోపిడే..దోపిడీ..
- అక్రమ భవనాల సీజింగ్లో కాసుల కక్కుర్తేనా
- కార్పొరేషన్ అధికారులు కళ్ళున్న కబోదులేనా! లేక మనీ మైకంలో కనబడడం లేదా..
- సీజింగ్ భవనానికి టూ లెట్ బోర్డు ఎలా ప్రత్యక్షం అయిందో అధికారులే చెప్పాలి
- కార్పొరేషన్లో అక్రమ భవనాల సీజింగ్ తొలగింపులో కోట్లల్లో అవినీతి సొమ్ము చేతులు మారిందా..?
- కొంతమంది లంచగొండి అధికారులను ప్రజలు ‘‘ఛీ’’ కొడుతున్న సిగ్గేయడం లేదా?
కుత్బుల్లపూర్ నియోజక వర్గం నిజాంపేట్ కార్పొరేషన్ లో అక్రమ నిర్మాణాలకు అడ్డా అంటూ విమర్శలు రావడంతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ భవనాలను నిజాంపేట్ కార్పొరేషన్ అధికారులు 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో సీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది.
నిజాంపేట కార్పొరేషన్ లో నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వంలోని పెద్దల సహకారంతో తులసి కన్స్ట్రక్షన్స్ యజమాని సుబ్బారెడ్డి అనే బడా బిల్డర్ నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని కేశినేని గ్యారేజ్ ప్రస్తుత డిమార్ట్ కు ఆనుకొని నిజాంపేట్ గ్రామ సర్వే నెంబరు 329లో సుమారు మూడువేల చదరపు గజాల స్థలంలో
G1/UC/50/W-30/N/NMC, G1/UC/51/W-30/N/NMC, G1/UC/52/W-30/N/NMC, G1/UC/53/W-30/N/NMC,లో G+2 రెసిడెన్షియల్ గ్రామపంచాయతీ అనుమతి తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా సెల్లార్ తో పాటు ఐద అంతస్తుల కమర్షియల్ నిర్మాణలు, చేయడంతో గత సంవత్సరం 2022 ఫిబ్రవరి నెలలో నిజాంపేట్ కార్పొరేషన్ అధికారులు, సదరు అక్రమ నిర్మాణ భవనాన్ని సీజ్ చేయడం జరిగింది, ఈవిషయన్ని నిజాంపేట్ కార్పొరేషన్ అధికారులే ఆర్టీఐ ద్వారా తెలియజేయడం జరిగింది, కానీ ఇప్పుడు ఆ అక్రమ భవనానికి ఉన్న సీజింగ్ తొలగించడంతో కార్పొరేషన్ అధికారుల పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ లోపమా..? సీజింగ్ భవనానికి టులెట్ బోర్డు ప్రత్యక్షం..
నిజాంపేట కార్పొరేషన్ అధికారులు గత సంవత్సరం 2022 లో గ్రామపంచాయతీ రెసిడెన్షియల్ అనుమతి తో నిబంధనలకు విరుద్దంగా తులసి కన్స్ట్రక్షన్స్ ఏ సుబ్బారెడ్డి నిర్మించిన అక్రమ భవనానికి, నిజాంపేట్ కార్పొరేషన్ అధికారులు సీజింగ్ ను మరియు బ్యానర్ ను తొలగించి, దర్జాగా సదరు బడా బిల్డర్ టూలేట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది, సదరు బిల్డరు నిజాంపేట్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన సీజింగ్ ను, బ్యానర్ ను తొలగించినా నిజాంపేట్ కార్పొరేషన్ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తు చూడకపోవడంతో సీజింగ్ తొలగించే విషయంలో కార్పొరేషన్ అధికారులకు తులసి కన్స్ట్రక్షన్స్ వారికి మధ్య ఏమైనా లోపాయి కారి ఒప్పందం జరిగిందా…? అవినీతి సొమ్ము చేతులు మారిందా ….? అనే అనుమానాలు బలపడుతున్నాయి, గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణదారులకు కార్పొరేషన్ అధికారులు అండగా నిలిచారని అపవాదు కూడా ఉంది, కానీ ప్రభుత్వం మారిన నిజాంపేట్ కార్పొరేషన్ అధికారుల తీరు మాత్రం మారడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చర్యలు ఉంటాయా..చుసి వదిలేస్తారా..?
ఇప్పటికైనా నిజాంపేట్ కార్పొరేషన్ అధికారులు మేల్కొని తులసి కన్స్ట్రక్షన్ నిర్మించిన అక్రమ భవనాన్ని సీజ్ చేసి చర్యలు తీసుకుంటారా లేక చుసి చూడన్నటు వదిలేస్తారా అనేది మిలియన్ డాలరళ్ల ప్రశ్న…! అక్రమ నిర్మాణాలపై మరో కథనంతో మీ ముందుకు ఆదాబ్ హైదరాబాద్