- మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశం..
- ఓఎంఆర్ షీట్ పై హాల్ టికెట్ నంబర్, ఫోటో ఎందుకు లేవని ప్రశ్న..
- అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని ఆరా..
- కీలకమైన అంశాలను విష్మరించడం గర్హనీయమన్న హై కోర్టు..
హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించకపోవడం, ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫోటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఓఎంఆర్ షీటుపై హాల్టికెట్ నంబరు, ఫోటో ఎందుకు లేవని, అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని టీఎస్పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. అక్టోబరులో చేసినవన్నీ రెండో సారి ఎందుకు చేయలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల్లో అక్రమాల నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల ఏర్పాట్లు ఎలా చేయాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణ అధికారమని కమిషన్ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై అభ్యర్థులెవరూ అభ్యంతరం చెప్పలేదని, బయోమెట్రిక్, ఓఎంఆర్పై ఫోటోకు సుమారు రూ.1.50కోట్లవుతుందని టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఆధార్ వంటి గుర్తింపు కార్డు ద్వారా ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ధ్రువీకరించారని, పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్పీఎస్సీ బాధ్యత అని, పరీక్ష నిర్వహణలో ఖర్చుల విషయం ముఖ్యం కాదని, పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకున్నారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.