- అద్భుత కట్టడంగా అమరుల స్మారక చిహ్నం
- నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- ఆరు అంతస్తులతో భవన నిర్మాణం..!
- దాదాపుగా రూ. 180 కోట్లతో నిర్మాణం
- పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి వేముల
- అమరుల కుటుంబాలకు సన్మానం
హైదరాబాద్రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున, సచివాలాయానికి ఎదురుగా సువిశాల స్థలంలో నిర్మితమైన తెలంగాణ స్మారకాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే పనులు పూర్తికాగా, తుది మెరుగులు దిద్దుతున్నారు. పనులను మంత్రి వేముల ప్రశాంతరెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీస్థాయి కోడిగుడ్డు ఆకారం, అద్దంలా మెరిసిపోయే ఫినిషింగ్, పైభాగంలో ఎరుపుపసుపు కలగలిసిన రంగులో మండుతున్న జ్వాల ఆకృతిలో.. తెలంగాణ రాష్ట్రసాధనలో అమరులైన వారికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక అమరవీరుల స్మారకచిహ్నం అందుబాటులోకి రానుంది.. హైదరాబాద్ నడిబొడ్డున.. ఓ వైపు హుస్సేన్సాగర్, మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి మధ్యలో దీన్ని నిర్మించారు. ఈ నెల 22న ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ స్మారకానికి రూ.177.50 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన, అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మితం కావటం దీని ప్రత్యేకత. 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం లోపల ఓ మ్యూజియంతో పాటు సుమారు 100మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఆడియో
విజువల్ హాలు, 650 మంది కూర్చునే విధంగా కన్వెన్షన్ సెంటర్, పర్యాటకుల కోసం ఓ రెస్టారెంట్తోపాటు ఇతర సౌకర్యాలు, 350 కార్లు, 600 బైకులకు సరిపడా పార్కింగ్ సౌకర్యం ఉన్నది. భవనం నిర్మాణ వైశాల్యం 2.88 లక్షల చదరపు అడుగులు. హుస్సేన్సాగర్ అందాలు, బుద్ధవిగ్రహం, బిర్లామందిర్, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలు వీక్షించేందుకు వీలుగా టెర్రస్పై రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. అమరుల స్మారకం నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా, ప్రస్తుతం ఫినిషింగ్ పనులు, ప్రధాన ద్వారం, గ్రీనరీ తదితర పనులు కొనసాగుతున్నాయి.అమరులకు గౌరవ సూచికంగా కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ప్రపంచవ్యాప్తంగా ఆనవాయితీ.. ఈ క్రమంలోనే వెలుగుతున్న దీపం ఆకృతిగల నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ ఎంపికచేశారు. చుట్టూ స్టీలు వలయం ఉన్నప్పటికీ భవనం వేడెక్కకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. పఫ్ మెటీరియల్, సపోర్టింగ్ జీఆర్సీ షీట్లు లోపల ఉష్ణోగ్రతను నియంత్రించటంలో సహాయపడతాయి. అమరుల స్మారకానికి సంబంధించి పాలిష్ చేయబడి ఉబ్బినట్లుగా ఉన్న బాహ్యభాగం పశ్చిమ చైనీస్ నగరమైన కరామేలోని ’క్లౌడ్ గేట్’, చికాగోలోని ‘బీన్’ నిర్మాణాలను పోలి వుంటుంది. ఇది ప్రత్యేక రాష్ట్రసాధన ఉద్యమ అమర వీరులకు నివాళులర్పించే సంప్రదాయ మట్టి నూనె దీపాన్ని పోలి ఉండటం విశేషం. 161అడుగుల ఎత్తు, 158 అడుగుల వెడల్పుతో ప్రపంచంలో ఇంత పెద్ద అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణం మరెక్కడా లేదు. హుస్సేన్సాగర్ తీరంలో నిర్మించిన 125 అడుగుల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుండగా, అమరుల స్మృతి చిహ్నం మరో పర్యాటక కేంద్రంగా మారనున్నది. ఓ వైపు అత్యంత ఆకర్షణీయ సచివాలయం, మరోవైపు, ఆహ్లాదకర హుస్సేన్సాగర్ పరిసరాలు, బుద్ధుని విగ్రహం, లుంబినీ పార్క్, ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్కు తోడు అమరుల స్మారక చిహ్నం హైదరాబాద్ నగరానికి మరింత వన్నె తేనుంది. ప్రారంభోత్సవం సందర్భంగా తుపాకులతో అమరవీరులకు గన్ సెల్యూట్ సమర్పించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటారు.అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అమరజ్యోతిని సీఎం కెసిఆర్ ప్రారంభిస్తారు. భలో ప్రముఖ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ దేశపతి అమరులకు నివాళులర్పిస్తూ గేయాన్ని ఆలపిస్తారు. సభలో 10వేల మంది క్యాండిల్ లైట్స్ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పిస్తారు. సభలో ఎంపికచేసిన ఆరుగురు అమరుల కుటుంబాలకు సన్మానం. డ్రోన్లతో షో, అమరవీరులకు జోహార్ అనే అక్షరాలతో స్మారకంపై లేజర్ షో నిర్వహిస్తారు.