Thursday, May 2, 2024

జగన్ ది పైశాచిక ఆనందం..

తప్పక చదవండి
  • చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో జగన్ నిజస్వరూపం బైటపడింది..
  • అవినీతి మచ్చలేని నేతగా చంద్రబాబు విశ్వసనీయత ప్రపంచానికి తెలుసు..
  • టీడీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యంతో ఆంద్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఖూనీ..
  • ప్రజల తిరుగుబాటుతో జగన్ అరాచక పాలనకు త్వరలోనే అంతం..
  • టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆగ్రహం..

హైదరాబాద్ : అవినీతి మచ్చలేని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమ కేసులు బనాయించి రోజుల తరబడి జైల్లో పెట్టి వైయస్ జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షసాధింపు రాజకీయాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులకు దిగి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న జగన్ పై ప్రజలు తిరుగు బాటు చేసి ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, జైలుకు తరలింపును నిరసిస్తూ సోమవారం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకు మౌన దీక్ష చేపట్టి, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించి ‘నేను సైతం బాబు వెంటే’ అనే నినాదంతో… ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్టు తీరుపై యావత్ ప్రపంచం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను తప్పుబడుతొందని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి వ్యక్తి గత, రాజకీయ కక్ష్యతో తప్పుడు కేసులు నమోదు చేసి టిడిపి అధినేత నేత నారా చంద్రబాబు నాయుడును, టీడీపీ శ్రేణులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా ఉంటూ లక్షల కోట్లు ఖర్చు చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ను కేవలం 371 కోట్ల రూపాయల స్కాం చేశారని జైల్లో పెట్టడం దుర్మార్గమన్నారు. జగన్ సర్కారు దౌర్జన్య పాలనను ప్రజలంతా ముక్తకంఠంతో
ఖండిస్తున్నారని చెప్పారు. జగన్ అప్రజాస్వామిక చర్యను నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం శ్రేణులుగా సోమవారం రోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రాన్ని అందించామని జ్ఞానేశ్వర్ తెలిపారు. నిర్బంధాలు, తప్పుడు కేసులతో చంద్రబాబును ఆపడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ప్రజల శేయస్సు కోరే ఆయనపై అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలు చేయడం ఆకాశం మీద ఉమ్మివేయడమేనని ఎద్దేవా చేశారు. విజన్ 2020 లక్ష్యంగా ఐటీ పరిశ్రమ స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలో లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కాసాని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయత ఏమిటో ప్రపంచానికి తెలుసని, అక్రమ కేసుల లోగుట్టు యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. జగన్ ప్రభుత్వం కుట్రలు ఫలించవని, అక్రమ కేసుల నుండి చంద్రబాబు కడిగిన ముత్యంలా త్వరలోనే జైలు నుండి బయటకు వస్తారని.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనకు మద్దతుగా ఉంటారని కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.

- Advertisement -

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజకీయాలను ప్రభావితం చేసి ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు చంద్ర బాబు నాయుడు అన్నారు. విజన్ 2047తో.. ప్రజలందరినీ అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆయన ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అలాంటి గొప్ప నేతను విజన్ కాదు రిజైన్ గా చేయాలన్న ఆలోచనతో జగన్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవరిస్తుందని మండిపడ్డారు. దూరదృష్టి గల విజనరి లీడర్ ను జైలు పాలు చేసే దుస్థితికి తేవడం అన్యాయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత గా ఉన్న చంద్రబాబుకు ముందస్తు నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక, అనాగరిక చర్య అని రావుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు మాట్లాడుతూ… స్వామీ వివేకనంద చెప్పినట్లు అల్ప బుద్ది ఉన్నోనికి అధికారం ఇస్తే.. అంధకారంలోకి నెట్టినట్లు నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన అలానే ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దేశాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్న జగన్ కు ప్రజా కోర్టులో రాజకీయ సమాధి కాక తప్పదని నర్సింహులు హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి,టి. జ్యోత్స్న, జాతీయ కార్యదర్శి కాసాని వీరెశ్, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు కాట్రాగడ్డ ప్రసూన, బండి పుల్లయ్య, నందమూరి సుహాసిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజు నాయక్, గడ్డి పద్మావతి, జక్కిలి ఐలయ్య యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీనివాస్ నాయుడు, మ్యాడం రామేశ్వరావు, బిల్డర్ ప్రవీణ్, సూర్యదేవర లత, అనుబంధ సంఘాల అధ్యక్షులు భవనం షకీలా రెడ్డి, శ్రీపతి సతీష్, పొలంపల్లి అశోక్, పర్లపల్లి రవీందర్, తాళ్ళికోట హరికృష్ణ, రాష్ట్ర కార్యా నిర్వాహక కార్యాదర్శులు మేకల బిక్షపతి ముదిరాజ్, పి.రవీంద్రాచారి, ఎస్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు