Monday, May 6, 2024

అధికార పార్టీకి పట్టం కడతారా.!

తప్పక చదవండి
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న ఏకైక ఎస్టీ నియోజక వర్గం వైరా రాజకీయాలు..
  • టికెట్ల కోసం గులాబీ నేతల పోటీ..
  • అధినేత హామీతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే..
  • ఎవరికివారుగా గులాబీ నేతలు విస్తృత పర్యటనలు..
  • కాంగ్రెస్‌కు తప్పని వర్గ పోరు..
  • హస్థాన్ని వణికిస్తున్న వెన్నుపోటు రాజకీయం..
  • కీలకంగా మారిన కమ్యూనిస్టులు నిర్ణయం..
  • ఓటు బ్యాంకు పెంచుకున్న కమలం పార్టీ..
  • సంక్షేమం వైపే మొక్కు చూపునున్ననియోజకవర్గ ప్రజలు..
    ఖమ్మం : జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో.. ఏకైక ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం వైరా. ఎన్నికలకు 3 నెలల సమయం ఉండడంతో నియోజకవర్గ రాజకీయం రోజురోజుకు హీట్‌ ఎక్కుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చిత్రపటంలో వైరా నియోజకవర్గం ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. డి లిమిటేషన్‌ ప్రక్రియ తర్వాత జరిగిన పలుమార్లు ఎన్నికల్లో ఓటర్ల తీర్పు భిన్నంగానే ఇస్తున్నారు. ఒక్కసారి పట్టం కట్టిన నాయకునికి మరోసారి గెలిపించుకున్న దాఖలాలు లేవు. కానీ ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో గెలిచిన ఓడిన నాయకులందరూ ఈసారి కూడా ఓటు కోసం ప్రజల ముందుకు రానున్నారు.. గతంలో మాదిరిగా ఏ పార్టీ నుంచి కూడా కొత్త నాయకుడు బరిలో దిగే దాఖలాలు కనిపించడం లేదు. ఆయా పార్టీలో ఉన్న నాయకులే ఎవరికి వారుగా టికేట్‌ కోసం ఆయా పార్టీలో విపరీతంగా పోటీ పడుతున్నారు.
    అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలలో సైతం వరకు టిక్కెట్‌ ఆశించే నాయకులు కోకొల్లలుగా ముందుకు వస్తున్నారు. నిన్నటి వరకు ఒకరిద్దరిగా అనుకున్న నాయకుల సంఖ్య కాస్త ఇప్పుడు పదుల సంఖ్యలకు చేరే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు పార్టీలో గెలిచిన నాయకులంతా కారు పార్టీలోకి చేరారు. ఈ నేపథ్యంలో వైరా రాజకీయ ముఖ చిత్రం ఎంతో ఆసక్తిగా మారింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 2009 లో వైరాలో ఎర్రజెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. గత 2018 ఎన్నికల్లో.. ఇక్కడి జనం విలక్షణమైన తీర్పు ఇచ్చారు. పార్టీలను కాదని.. ఓ స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు వైరా ఓటర్లు. అలా.. ఇప్పటిదాకా జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో.. మూడు రకాలు తీర్పులిచ్చారు. నాలుగో సారి మాత్రం గత మూడు సార్లకు భిన్నమైన తీర్పు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది.
    వైరాలో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో.. ఎస్టీల ఓట్‌ బ్యాంక్‌ 50 వేలుగా ఉంది. ఎస్సీ ఓటర్లు 29 వేల మందికి పైనే ఉన్నారు. ఓసీలు 35 వేలకు పైగా ఉండగా.. బీసీ ఓట్‌ బ్యాంక్‌ లక్షా 40 వేలకు పైనే ఉంది. వీళ్లే.. వైరాలో గెలుపోటములను నిర్ణయించేది. అందుకే ఈ సారి వైరా సీటును ఎలాగైనా గెలుచుకోవాలని.. బీఆర్‌ఎస్‌తో పాటు ప్రధాన పార్టీలన్నీ ఫోకస్‌ పెంచేశాయ్‌. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు ఎవరికి వారు క్యాంపులు ఏర్పాటు చేసుకొని మరీ లోకల్‌ పాలిటిక్స్‌ని హీటెక్కిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు అధికార పార్టీలోకి చేరినట్లుగాని ఇక్కడ కూడా ఇండిపెండెంట్‌ గా గెలిచిన రాములు నాయక్‌ సైతం అధికార పార్టీలోకి చేరిపోయారు. ఇక వీరిపై ఓడిపోయిన మదన్‌ లాల్‌, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సైతం కారు పార్టీలోనే వుండి టికెట్‌ కోసం విశ్వప్రత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి టిక్కెట్‌ తనకే వస్తుందంటూ ఎవరికి వారుగా పోటాపోటీగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎవరికి వారుగా ప్రజల లోకి తీసుకువెళ్లి హడావిడి చేస్తు న్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి 24 అవర్స్‌ విస్తృత ప్రచారం పెంచినట్లు అయింది. చివరి నిమి షం వరకు ఎవరికీ టిక్కెట్‌ ఖరారు చేస్తారో తెలియక ఎవరికి వారుగా నియోజకవర్గంలో ప్రజల్లో మమే కమై ఉంటున్నారు. ఎమ్మెల్యే మాత్రం పూర్తి ధీమాతో తన పర్యటనలు రోజురోజుకు పెంచుతున్నారు.
    స్వతహాగా కాంగ్రెస్‌ నేత అయిన రాములు నాయక్‌ గత ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై ఉన్న వ్యతిరేకత కారణంగా.. అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అనుచరులంతా.. బీఆర్‌ఎస్‌కు కాకుండా స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్‌కు మద్దతు తెలపడంతో.. ఆయన అనూహ్య విజయం సాధించారు. గెలిచిన కొన్నాళ్లకే పొంగులేటి ఆధ్వర్యంలో కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. జనవరి నెలలో పొంగులేటి బీఆర్‌ఎస్‌ వీడినప్పటికీ రాముల నాయక్‌ కార్‌ పార్టీలను ఉన్నారు.
    కాంగ్రెసులో గ్రూపుల గోల, వెన్నుపోటు భయం :
    కాంగ్రెస్‌ పార్టీలో నాయకులకు ప్రజలకు గ్రూపుల గోల వెన్నుపోటు భయం పట్టుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి ఆ భయం కాస్త ఇంకా ఎక్కువైంది. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బిజెపిలో చేరుతాడని తమ టిక్కెట్లు సేఫ్‌ అని భావించిన కాంగ్రెస్‌ ఆశావాహులు కాస్త పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి హస్తం గూటికి చేరడంతో ఆ పార్టీ నాయకులు అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలోకి చేరకముందే పొంగులేటి ఆ పార్టీ అభ్యర్థిని పర్యటించారు.. గతంలో సిపిఐ పార్టీ నుండి వైరా బరిలో దిగి ఓడిపోయిన విజయ భాయ్‌ ఈసారి తన అభ్యర్థిగా వైరా నుంచి పోటీ చేస్తుందని చెప్ప కోచ్చారు. ఆ పార్టీలో టికెట్‌ పై ఆశ పెట్టుకున్న నాయకులు నిరాశకు లోనయ్యారు. అయినా అప్పటితో ఆగ కుండా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నాయకులు నియోజవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే విజయబాయిపై నియోజకవర్గంలోనూ అంతగా పర్యటించలేదనే అసంతృప్తి క్యాడర్‌లో ఉంది. వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కు బలమైనప్పటికీ పొంగులేటి ప్రకటించిన అభ్యర్థి విషయంపై ప్రజలు పెదవిరుస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న మూడు వర్గాలకు చెందిన నాయకులు కూడా పోటాపోటీగా నియోజవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా.. భట్టి విక్రమార్క అనుచరుడిగా మాలోత్‌ రాందాస్‌ నాయక్‌.. వైరాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు.. రేణుకా చౌదరి అనుచరుడిగా ఉన్న రామ్మూర్తి నాయక్‌.. టికెట్‌ తనకేనని క్యాంప్‌ ఆఫీస్‌ కూడా మొదలుపెట్టేశారు. మరోవైపు.. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బానోతు బాలజీ నాయక్‌ కూడా తనకే టికెట్‌ వస్తుందనే ప్రచారం మొదలుపెట్టారు. ఇలా.. ఎవరికి వారు సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.
    ఇక బీజేపీ సీటు కోసం బీజేవైఎం జిల్లా ఇంచార్జ్‌ కట్రావత్‌ మోహన్‌ నాయక్‌ పోటీ పడుతున్నారు. గత 10 నెలల క్రితం వైరా సీటు ఆశించి ఇక్కడికి వచ్చిన మోహన్‌ నాయక్‌ నియోజకవర్గంలో హడావుడి చేశారు. చాప కింద నీరుల ఆ పార్టీ ఓటు బ్యాంకును పెంచుకునే పనిలో నిమగ్నమైంది. బిజెపితోపాటు సంఫ్‌ు పరివర్‌ క్షేత్రాలతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఓట్లను రాబట్టుకునే పనిలో ఉన్నారు. అదేవిధంగా వైరా నియోజవర్గంలో పోటీ చేసేందుకు ఉభయ కమ్యూనిస్టులు తహతహలాడుతున్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బి.ఆర్‌.ఎస్‌. అధినేత కెసిఆర్‌ సెట్టింగ్‌ ఎమ్మెల్యేలను తప్పనిసరి అయితేనే మారుస్తానని చెప్పడంతో పాటు, స్థానిక ఎమ్మెల్యేకి పూర్తిస్థాయి భరోసానివ్వడం మరోవైపు మదన్‌లాల్‌, చంద్రా వతులకు సైతం అన్యాయం జరగనివ్వలని హామీ ఇవ్వడం వంటి విషయాలు పరిశీలిస్తే రానున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమనిపిస్తుంది. పార్టీలో వర్గ పోరు ఉన్నప్పటికీ నాయకులు, కార్యకర్తలు, ఓటరు చెదిరిపోకుండా చూసుకుంటే కారు పార్టీ గట్టెక్కినట్లే.
    2018 వైరా నియోజకవర్గ ఎన్నికల్లో స్వతంత్ర గా పోటీ చేసిన లావుడ్య రాములు నాయక్‌ 52,650 (33.36శాతం) ఓట్లు సాధించారు. అదేవిధంగా టిఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన బానోత్‌ మదన్‌లాల్‌ 50,637 (32.08శాతం) రెండో స్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం పొంగులేటితో జతకట్టి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న, నాటి సి.పి.ఐ అభ్యర్థి బానోత్‌ విజయ 32,757( 20.75 శాతం ) పరిమితమయ్యారు. ఇక సీపీఐ(ఎం) నుంచి భూక్యా వీరభద్రం 11,373 (7.21శాతం ) ఓట్లు సాధించగా లావుడియా రాముల నాయక్‌ 2,013 ఓట్ల మెజార్టీ సాధించారు. అదే విధంగా 2014 ఎన్నికల పరిశీలిస్తే అప్పటి ఎన్నికల్లో వైఎస్‌ఆర్సిపి నుండి బరిలో నిలిచిన బానోత్‌ మదన్‌లాల్‌ 59,318 (40.35శాతం ) ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. రెండవ స్థానంలో టీడీపీ అభ్యర్థి బానోత్‌ బాలాజీ 48,735 (33.15శాతం) మూడవ స్థానంలో సి.పి.ఐ అభ్యర్ధి మూడు నారాయణ 27,071 (18.41 శాతం ) ఉండగా మరో మారు టిక్కెట్‌ ఆశిస్తున్న అప్పటి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ చంద్రావతి 7,704 (5.24 శాతం) ఓట్లు మాత్రమే సాధించగలిగారు.. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీచేసిన సి.పి.ఎం.అభ్యర్థి బానోత్‌ చంద్రావతి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అయిన రాంచంద్రనాయక్‌ పై 13661 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చంద్రావతికి 53090 ఓట్లురాగా, రాంచంద్రనాయక్‌కు 393464 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి బానో వాణికి 16665 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 13 అభ్యర్థులు పోటీ చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు