Saturday, July 27, 2024

మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు చూసిన శిలాయుగపు రేఖా చిత్రం

తప్పక చదవండి
  • మూసాపేటలో 4వేల సంవత్సరాల నాటి రేఖా చిత్రం గుర్తింపు
  • మూసాపేటలో బయటపడిన ఆదిమానవుని ఆనవాళ్లు..
  • కాపాడుకోవాలంటున్న ఈమని శివనాగిరెడ్డి.

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రం, మూసాపేటలో ఆదిమానవుని ఆనవాళ్లు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.. మూసాపేటలోని రామస్వామి గుట్టపై గల రామలింగేశ్వర ఆలయ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయడం కోసం, గ్రామస్తుల ఆహ్వానంపై ఆయన జరిపిన అన్వేషణలో కొండ శిఖరం పై ఒక బండ పైన కొత్త రాతియుగపు ఎద్దు బొమ్మ రేఖా చిత్రం అనుకోకుండా కనిపించిందని ఆయన చెప్పారు. నేలమట్టం నుంచి 400 అడుగులు ఎత్తు ఉన్న రామస్వామి గుట్ట శిఖరాన గల రెండు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, ఆరు మీటర్ల మందం గల ఒక బండపై భాగంలో 10 సెంటీమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్లు ఎత్తుగల ఎద్దు బొమ్మ రేఖా చిత్రంలో ఎద్దు తల, కొమ్ములు, శరీరం, నాలుగు కాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ బొమ్మ కింద కొన్ని జంతువులు, మానవుల రేఖా కూడా చిత్రాలు ఉన్నాయన్నారు. పశు పాలన, వ్యవసాయం ముఖ్య వృత్తిగా గల కొత్త రాతియుగపు మానవుడు తాను నిత్యం వాడే రాతి పనిముట్లతో ఆ ఎద్దు బొమ్మను చెక్కివుంటాడని, గతంలో వెలుగు చూసిన ఇలాంటి ఎద్దు బొమ్మల ఆధారంగా, మూసాపేట రేఖా చిత్రం ఇప్పటికి 4000 సంవత్సరాల నాటిదని, ఎండకు ఎండి, వానకు తడిచి, కొంత స్పష్టత కోల్పోయిందని, పురావస్తు, చారిత్రక ప్రాధాన్యత గల ఈ ఎద్దు బొమ్మ రేఖా చిత్రాన్ని కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర శెట్టి, భాస్కర్ గౌడ్, స్థపతి వెంకటరెడ్డి, విశ్వేశ్వర్, కొండయ్య పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు