- విగ్నేష్ చదువు ఇక విఘ్నమేనా..?
- పెద్దదిక్కును కోల్పోవడంతో ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని
దీనంగా గుడిసెలో జీవిస్తున్న విగ్నేష్ కుటుంబం
నర్సంపేట : పేదరికంలో ఉండి, కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కూడా లేని పరిస్థితి కొన్ని కుటుంబాలలో నేటికీ మన సమాజంలో ఉంది.. అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి, తల్లి దండ్రుల పేదరికం వల్ల అది పిల్లల పాలిట శాపంగా మారు తుంది.. కొన్ని అనుకోని సంఘటనల వలన ఇంట్లో ఎదుగుతున్న వారు, మంచి స్థాయికి వచ్చేవారు, అనారోగ్య పరిస్థితి, ఇతర దురదృష్టవశాత్తు జరిగిన పరిస్థితుల వలన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. చివరికి వారి పిల్లలే బాధితులుగా మిగిలి పోతున్నారు. అలాంటి ఘటనే జనగామ జిల్లా రేగుల గ్రామంలో చోటుచేసుకుంది. 16 సెప్టెంబర్, 2023, సాయంత్రం 5.00 గంటలకు జనగామ జిల్లా, కొడకండ్ల మండలం, రేగుల గ్రామానికి చెందిన కొత్తగట్టు యాకయ్య (గోపాల్), తండ్రి సోమయ్య అనారోగ్యంతో వరంగల్ లోని ఎం.జి.ఎం. దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతనికి, భార్య, ఇంటర్ చదివే కుమారుడు, పాఠశాలకు వెళ్లే కుమార్తె ఉన్నారు. కడు బీదరిక పరిస్థితి, కుమారుడు విగ్నేష్ గత సంవత్సర పదవ తరగతి లో అవుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మొదటి ర్యాంక్ (స్కూల్ టాపర్) సాదించి పాఠశాల పేరు నిలబెట్టాడు. అతడి ప్రతిభకు మెచ్చి నగదు ప్రోత్సాహంతో సదరు పాఠశాల పూర్వ టీచర్ పి.లక్ష్మి నరసింహ మూర్తి తన తల్లి దండ్రుల జ్ఞాపకార్థం పేరిట నగదు అందజేసి, శాలువాతో సన్మానించారు. విగ్నేష్ ప్రతిభకు మెచ్చి ప్రస్తుతం హైదరాబాద్ లోని అనాధ విద్యార్థి గృహం అనే సంస్థ సహకారంతో ఉచితంగా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. యాకయ్య భార్య సుజాత కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితి. ప్లాస్టిక్ కవర్లు వేసుకొని గుడిసెలో నివసిస్తున్నారు. ఇప్పుడు యాకయ్య మరణించడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలోఉంది. తోచినంత ఆర్థిక సహాయము చేసి యాకయ్య కుటుంబాన్ని ఈ ఆపద సమయంలో ఆదుకోవాల్సిన అవసరం ఉందని మానవతవాదులు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. సహాయం చేయాలనుకునే వారు గూగుల్ పే లేదా ఫోన్ పే నెంబర్:9676007716 (అకౌంట్ పేరు రాకేష్ రెడ్డి దోపతి) కు తోచిన సహాయం చేయగలరు అని విగ్నేష్, అతని తల్లి సుజాత, చెల్లెలు ప్రాధేయ పడుతున్నారు.
తప్పక చదవండి
-Advertisement-